యాదాద్రి భువనగిరి : మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి లోన్ వచ్చిందని చెప్పి ఓ మహిళ వద్ద డబ్బులు, బంగారం తీసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఊడాయించిన సంఘటన యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన షేక్ మల్లికాబీ అనే మహిళ గ్రామంలో ఒక్కతే నివాసం ఉంటుంది.
శనివారం ఓ వ్యక్తి సదరు మహిళ వద్దకు వచ్చి నీకు మైనారిటీ శాఖ నుంచి లోన్ వచ్చిందని చెప్పి, మీసేవకు వెళ్లి డీడీ కడితే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని చెప్పాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని మహిళతో చెప్పాడు. అయితే ఆ వ్యక్తి మాటలను నమ్మిన మహిళ అతని ద్విచక్ర వాహనంపై వంగపల్లి వద్దకు చేరుకున్నారు.
అక్కడికి వెళ్లిన తర్వాత మీ సేవలో డీడీ కట్టాలని రూ.15 వేలు కావాలని చెప్పాడు. దీంతో ఆ మహిళ తన వద్ద ఉన్న ఎనిమిది వేల రూపాయల మాత్రమే ఉన్నాయని చెప్పింది. అయితే ఆ వ్యక్తి కచ్చితంగా పదిహేను వేలు కావాలి అని చెప్పడంతో ఆ మహిళ తన వద్దనున్న అర తులం బంగారు కమ్మలు ఆ వ్యక్తికి ఇచ్చింది.
కాగా, దానిని బ్యాంకులో కుదువపెట్టి డబ్బులు తీసుకొస్తానని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ వ్యక్తి ఎంతకీ రాకపోవడంతో మోసపోయానని గుర్తించిన మహిళ గ్రామస్తులకు సమాచారం అందించింది. సదరు మహిళ గురించి తెలిసిన వ్యక్తి ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చునని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
ఇవి కూడా చదవండి..
TTD | అలాంటి ప్రకటనలు నమ్మి మోసపోకండి : టీటీడీ
Yadadri temple | యాదాద్రిలో భక్తుల కోలాహలం..
Ramappa | రామప్పను సందర్శించిన విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు
Siddipet | నెక్లెస్ పోగొట్టుకున్న మహిళ..గంటలోనే కేసును చేధించిన పోలీసులు