యాదాద్రి : యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయాయి. వారాంతపు సెలవుదినం కావడంతో ఆదివారం యాదాద్రీశుడిని దర్శించుకు నేందుకు వచ్చిన భక్తులతో యాదాద్రి పోటెత్తింది. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించుకునేందుకు గంటల కొద్దీ క్యూ కట్టారు.
రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను అనమతించలేదు. స్వామివారి ధర్మదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మొదలైంది. నారసింహుడికి నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు.
ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు.
సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపారు. కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సం ఖ్యలో పాల్గొన్నారు.
సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించనున్నారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం చేశారు. పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి.