హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): విలేకరుల సమావేశంలో తనను ప్రశ్న అడిగిన జర్నలిస్టుపై నిజామాబాద్ బీజేపీ అర్వింద్ నోరు పారేసుకున్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తనను ప్రశ్న అడిగిన జర్నలిస్టును ఉద్దేశించి ‘బేవకూఫ్’ ఇప్పుడే చెప్పిన కదా..! వినా లే..’ అంటూ అహంకార ధోరణిలో వ్యాఖ్య లు చేశారు. జర్నలిస్టుపై ఎంపీ అర్వింద్ చేసి న వ్యాఖ్యల వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. జర్నలిస్టులు ఎంపీ అహంకార ధోరణిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఎంపీ అర్వింద్ జర్నలిస్టుపై అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలపై తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని మండిపడింది. ఫెడరేషన్ రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పీ రాంచందర్, ప్రధాన కార్యదర్శి బీ బసవపున్నయ్య ప్రకటన విడుదల చేశారు. జర్నలిస్టుపై చేసిన వ్యాఖ్యలను ఎంపీ అర్వింద్ వెంటనే ఉపసంహరించుకోవాలని, తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.