న్యూఢిల్లీ, డిసెంబర్ 4: సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అమరులైన 702 మంది రైతుల వివరాలతో కూడిన జాబితాను సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) శనివారం కేంద్రప్రభుత్వానికి పంపించింది. రైతుల మరణాలపై తమ వద్ద సమాచారం లేదని, పరిహారం ఇచ్చే ప్రశ్నే లేదని కేంద్రం లోక్సభలో చెప్పిన నేపథ్యంలో రైతులు ఈ చర్యకు పూనుకొన్నారు. శనివారం ఎస్కేఎం కీలక సమావేశం జరిగింది. మద్దతు ధర చట్టం, అమరులైన రైతుల కుటుంబాలకు పరిహారం, రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ డిమాండ్లపై కేంద్రప్రభుత్వంతో చర్చించేందుకు ఎస్కేఎం ఐదుగురు సభ్యులతో ప్యానెల్ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ వెల్లడించారు. మంగళవారం మళ్లీ ఎస్కేఎం సమావేశం అవుతుందని చెప్పారు. తమ భవిష్యత్ కార్యాచరణపై ఆ రోజే నిర్ణయం తీసుకొంటామని తెలిపారు. తమ మూడు డిమాండ్లు నెరవేరే వరకు ఢిల్లీ సరిహద్దుల నుంచి కదిలే ప్రసక్తే లేదని రైతు నేతలు తేల్చి చెప్పారు. ప్యానెల్లో రైతు నేతలు.. బల్బీర్ సింగ్ రాజేవాల్, అశోక్ ధావ్లే, శివ్ కుమార్ కక్కా, గుర్నామ్ సింగ్, యుద్ధవీర్ సింగ్ ఉన్నారు.