ధన్వాడ, మే 4: అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం ఉండాలన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు పావలా వడ్డీకి రుణాలు ఇవ్వండంతోపాటు స్వయం ఉపాధి కోసం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నది. అయితే తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం వినూత్న పథకం ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన అందించడానికి ఎన్ఆర్ఎల్ఎం (నేషనల్ రూరల్ లైవ్లీ మిషన్) అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా ఎంపిక చేసిన మండల సమాఖ్యలకు వ్యవసాయ పనిముట్లను అందించారు. అందులో భాగంగానే ధన్వాడ సమాఖ్యకు ట్రాక్టర్తోపాటుగా రూ.25 లక్షలతో వ్యవసాయ పనిముట్లను అందించారు. గతంలో వీటిని ధన్వాడ పర్యటనకు వచ్చిన మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. వీటిని వ్యవసాయ పనులకు ఆద్దెకు ఇచ్చి ఆర్థికంగా ఎదగాలన్నదే ఈ పథకం ఉద్దేశ్యం.
బయటితో పోలిస్తే తక్కువ అద్దె…
బయట వ్యక్తుల వద్ద వ్యవసాయ పనిముట్లు తెచ్చుకుంటే అద్దె ఎక్కువగా ఉంటుంది. అదే మహిళా సంఘాల నుంచి అయితే తక్కువ అద్దెకు వచ్చే అవకాశం ఉంది. ట్రాక్టర్ ట్రాలీకి రూ.600 తీసుకుంటారు. అదే మహిళా సంఘాల్లో తీసుకుం టే రూ.550, కలుపుయంత్రం ప్రైవేట్లో అయితే రూ.500, మహిళా సంఘంలో అయితే రూ.450, ట్రాక్టర్ చక్రాలు ప్రైవేట్లో గంటకు రూ.1100, మహిళా సం ఘలో రూ.1000, డ్రమ్ సీడర్ యంత్రం ప్రైవేట్లో ఎకరాకు రూ.300, మహిళా సంఘంలో రూ.250కే అందిస్తున్నారు.