వర్గల్, ఏప్రిల్ 11: మండుటెండల్లో గోదావరి నీళ్లను మెతుకు సీమలో పారించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంగుట్ట హల్దీవాగు వద్ద గోదావరి జలాలకు చీరె, సారె సమర్పించి కుంభహారతి, నక్షత్ర హారతులు ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ఇక సాగు, తాగునీటి కష్టాలు ఉండవన్నారు. ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని తాగునీటికి పడేకష్టాలను ప్రభుత్వం తొలగించిందన్నారు. ఇంతకుముందు నాచారం గుట్టకు వచ్చే భక్తులకు నీళ్లు దొరక్కా తలపై నీళ్లు చల్లుకుందామంటే వాటర్ బాటిళ్లు వెంట తెచ్చుకునేవాళ్లని, ఇప్పుడు ఆ పరిస్థితి మారి పవిత్ర గోదావరి నీళ్లతో మండుటెండల్లో స్నానాలు చేసి దేవుడిని దర్శించుకునేలా చేశామన్నారు. భవిష్యత్లో గుంటెడు జాగ కూడా బీడు ఉండకుండా తెలంగాణ పచ్చదనంతో కళకళలాడుతుందని మంత్రి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం తాగు, సాగునీరు లేక ఎడారిగా మారినా అప్పటి పాలకులు పట్టించుకోలేదని, ఇప్పుడు నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం సరికాదన్నారు. మండుటెండల్లో వాగులు, చెరువులు, కుంటలు పారించిన ఘనత దేశంలో ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అంతకుముందు నాచగిరి లక్ష్మీనృసింహస్వామి రథోత్సవంలో పాల్గొని మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, గజ్వేల్ మన్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ, నాచారం ట్రస్టు బోర్డు చైర్మన్ హనుమంతరావు, ట్రస్టుబోర్డు సభ్యులు, ఈవో సుధాకర్రెడ్డి, ఆలయ సిబ్బంది, వర్గల్ ఎంపీపీ లతారమేశ్గౌడ్, జడ్పీటీసీ బాలమల్లు, నాచారం సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ వెంకటేశ్గౌడ్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పంటపొలాలు సస్యశ్యామలవుతాయి
కొండపోచమ్మసాగర్ నుంచి హల్దీవాగులో సాగునీరు చేరడం ద్వారా తూప్రాన్ మండలంలోని యావాపూర్, కిష్టాపూర్, నాగులపల్లి, ఇస్లాంపూర్, వెంకటరత్నాపూర్, జెండాపల్లి చెక్డ్యాంలు నిండి పంటపొలాలకు సాగు నీరందుతుంది. ప్రతి రైతు కండ్లలో ఆనందం కనిపిస్తుంది.
ఇవీ కూడా చదవండి…
14వ అంతస్తులో అగ్నిప్రమాదం.. అప్రమత్తతతో తప్పిన ముప్పు
త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు : మంత్రి కేటీఆర్