హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం ట్విట్టర్ వేదికగా ప్రజలతో #askktr పేరిట ముచ్చటించారు. క్రికెట్, సినిమా, రాజకీయాలు, పెట్టుబడులు, వ్యాక్సినేషన్, ఉద్యోగాలు వంటి పలు అంశాలపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. నెటిజన్ల ప్రశ్నలకు మంత్రి ఈ విధంగా స్పందించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఉన్న మాట వాస్తవమే అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి మాస్కు ధరించాలన్నారు.
సీఎం కేసీఆర్ అద్భుతమైన నాయకత్వం పటిమతో రాష్ట్రంలోకి అనేక పెట్టుబడులు వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా ఈ ట్రెండ్ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెరిగిందన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఐటి హబ్ నిర్మాణం కొనసాగుతుందన్నారు. త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్లతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. తన ఫేవరెట్ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ అని అయితే ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ అన్నారు. జాతి రత్నాలు సినిమా బాగుందన్నారు. బెంగాల్ ఎన్నికల్లో అంతిమంగా ప్రజాస్వామ్యం గెలవాలన్నారు.
నగరంలో 50కి పైగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ రానున్న పది పన్నెండు నెలల్లో పూర్తి అవుతుందన్నారు. కరోనా పైన ప్రత్యేక ప్రజలను చైతన్యం చేసే ఒక పాటను తయారు చేస్తానన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి అభినందనలు తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్ కి సంబంధించి ప్రస్తుతం బడ్జెట్లో నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. నిజామాబాద్ ఐటి హబ్ పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి మరిన్ని వరద కాలువల నిర్మాణం అవసరం ఉందని అయితే ఇవన్నీ ఒక్క రోజులో రెండు రోజుల్లోనూ అయ్యేది కాదని దీర్ఘకాలికంగా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
భారతదేశంలో ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక మద్దతు ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో వ్యవహరించారన్నారు. తెలంగాణలో లాక్డౌన్కు అవకాశం లేదన్నారు. నిజాంబాద్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన పసుపు బోర్డు ఏర్పాటు పైన… అది తీసుకొస్తానని బాండ్ పేపర్ మీద హామీ ఇచ్చిన వ్యక్తిని అడగాలన్నారు. వ్యక్తిగతంగా తన కూతురికి కొడుకుకి మనసు మాట వినాలని చెప్తా అని, ప్రత్యేకంగా ఎలాంటి సూచనలు ఇవ్వనని తెలిపారు. నాగార్జునసాగర్ ఎన్నికల్లోలో ప్రజల ఆశీర్వాదం టీఆర్ఎస్కు ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో గతానికి ప్రాతినిధ్యం వహించే జానారెడ్డి.. భవిష్యత్తుకు ప్రాతినిధ్యం వహించే యువకుడు నోముల భగత్కు మధ్యలో అని మంత్రి పేర్కొన్నారు.