కాలంతోపాటు ఆహారంలోనూ మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, నిన్న ‘మంచి’ చేసిన పదార్థాలే.. నేడు ‘హాని’కరం కావొచ్చని అంటున్నారు. వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూరలు, పండ్లు, పచ్చి కూరగాయలు.. వర్షాకాలంలో అనారోగ్యాన్ని కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు. అందుకే, వర్షాలు కురిసే సమయంలో కొన్ని ఆహార పదార్థాలను పక్కన పెట్టేయాలని సలహా ఇస్తున్నారు.
వానకాలంలో రోడ్లు, మార్కెట్ పరిసరాల్లో బురద నీరు ఎక్కువగా నిలుస్తుంది. అందులో దోమలు, ఈగలతోపాటు సూక్ష్మక్రిములు కూడా వృద్ధి చెందుతాయి. ఇవి పండ్లు, కూరగాయలపై వాలి.. బ్యాక్టీరియాను వ్యాపింపజేస్తాయి. ఇక వ్యాపారులు పండ్లు, కూరగాయలను సరిగ్గా కడగకపోయినా.. వాటిపై హానికరమైన సూక్ష్మ క్రిములు వృద్ధి చెందుతాయి. అలాంటి వాటిని సరిగ్గా కడగకుండా, వండకుండా తింటే.. ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ముఖ్యంగా, విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి లాంటి సమస్యల్ని సృష్టిస్తాయి. అంతేకాకుండా.. ఈ కాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు చాలావేగంగా వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలపై ఎక్కువగా వ్యాపిస్తాయి. కాబట్టి, వాటిని పచ్చిగా, సరిగ్గా ఉడికించకుండా తింటే.. ఈ క్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. లేనిపోని ఆరోగ్య సమస్యలను సృష్టిస్తాయి. కాబట్టి, వానకాలంలో ఆహారం విషయంలో ఈ కింది చిట్కాలు పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.