ప్రమాదవశాత్తూ గుడిసె దగ్ధం
వృద్ధ దంపతుల సజీవ దహనం
తంగళ్లపల్లిలో పెను విషాదం
కోహెడ, ఏప్రిల్ 16 : సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున పెను విషాదం జరిగింది. రాత్రి గుడిసెలో పడుకున్న వృద్ధ దంపతులు యాద నర్సయ్య(90), భార్య లచ్చవ్వ(85) తెల్లారకుండానే విగతజీవులయ్యారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తూ గుడిసెకు నిప్పు అంటుకొని దగ్ధం కాగా, అందులో పడుకున్న నర్సయ్య, లచ్చవ్వ సజీవ దహనమయ్యారు. గుడిసెకు నిప్పు అంటుకోగా, వీరిద్దరికి పక్షవాతం ఉండడంతో బయటికి వెళ్లలేక గుడిసెలోనే కాలిపోయారు. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో కోహెడ నుంచి శనిగరం వెళ్తున్న ప్రయాణికులు గుడిసెను చూసి ఇరుగు పొరుగును లేపారు.
పక్కనే ఉంటున్న కొడుకు బాలయ్య చుట్టూ పక్కల వారి సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. ఇద్దరిని బయటికి తీయగా, అప్పటికే వారు మృతి చెందారు. గుడిసెకు నిప్పు అంటుకోవడానికి కారణం విద్యుత్ షార్ట్సర్క్యూట్ లేదా నర్సయ్యకు చుట్ట తాగే అలవాటు ఉండి, తాగిన తర్వాత చుట్టను ఆర్పక పోవడంతో కానీ సంఘటన జరుగవచ్చునని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భావిస్తున్నారు. మృతులు నర్సయ్య లచ్చవ్వలకు ముగ్గురు కుమారులు బాలయ్య,కనుకయ్య, కొమురయ్యతో పాటు కూతురు మల్లవ్వలు ఉన్నారు. ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు కోనె శేఖర్, సర్పంచ్ పాము నాగేశ్వరి, వార్డు సభ్యులు సంఘటనపై స్పందించి, పోలీసులకు సమాచారమందించారు.
కోహెడ ఎస్సై నాంపల్లి రాజ్కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి నాయకుడు కొక్కుల సురేష్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆవుల మహేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే సతీశ్కుమార్కు సమాచారమందించి, రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మృతదేహాలను హుస్నాబాద్కు తీసుకువెళ్లేందుకు వీలులేక ఊరిచివరన పోస్టుమార్టం నిర్వహించారు. కాగా, 12ఏండ్ల క్రితం ఇద్దరికి పక్షవాతం రావడంతో కుమారులు నెలకొక్కరి చొప్పున వంతుల వారీగా సేవలందిస్తున్నారు. కాగా, శుక్రవారం జరిగిన సంఘటనలో ఇద్దరు మృతి చెందడం కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులను కలచివేసింది.