జెరూసలేం : పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో భారత్కు వెళ్లకుండా పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్, కెనడా, యూఏఈ, అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించగా.. ఇజ్రాయిల్ సైతం అదే బాటపట్టింది. తన పౌరులు భారత్ సహా ఆరు దేశాలకు వెళ్లకుండా నిషేధం విధించింది. ఆరు దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి కార్యాలయం, ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయిల్ పౌరులు ఉక్రెయిన్, బ్రెజిల్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా, భారత్, మెక్సికో, టర్కీకి వెళ్లకుండా నిషేధం విధించింది.
ఆంక్షలు ఈ నెల 3వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. అయితే, ఇజ్రాయిల్యేతర పౌరులు ఆయా దేశాలకు వెళ్లొచ్చని, ప్రస్తుతం ప్రయాణం కోసం ఎయిర్పోర్టుల్లో వేచి ఉన్నవారికీ ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఏడు దేశాల నుంచి తిరిగివచ్చే వారు రెండు వారాల పాటు తప్పనిసరిగా కార్వంటైన్లో ఉండాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. కరోనా నుంచి కోలుకున్నవారు, టీకా తీసుకున్నవారికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే, రెండు కరోనా నెగెటివ్ రిపోర్టులు ఉన్నవారికి క్వారంటైన్ కాలపరిమితిని పది రోజులుగా నిర్ణయించినట్లు పేర్కొంది.