న్యూఢిల్లీ, మే 1: ఢిల్లీలో ఆక్సిజన్ కొరత సమస్య మళ్లీ మొదటికొచ్చింది. పరిస్థితి కాస్త మెరుగుపడిందని ఇటీవల చెప్పిన దవాఖానలు ఇప్పుడు మళ్లీ ఆక్సిజన్ కోసం వెంపర్లాడే పరిస్థితి నెలకొన్నది. తమ దవాఖానలో ఆక్సిజన్ కొరత తీరిందని, రోగులను చేర్చుకొంటున్నామని చెప్పిన బాత్రా దవాఖానలో శనివారం ఆక్సిజన్ అందక పన్నెండు మంది కొవిడ్ రోగులు చనిపోయారు. అదే దవాఖానలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం హెచ్వోడీగా పనిచేస్తున్న ఆర్కే హిమథానీ కూడా మృతుల్లో ఉన్నారు. దవాఖానలో 2,500 లీటర్ల ఆక్సిజన్ ఉన్నప్పుడు శనివారం ఉదయమే ఆక్సిజన్ కోసం అధికారులకు సమాచారం ఇచ్చామని దవాఖాన మెడికల్ డైరెక్టర్ ఎస్సీఎల్ గుప్తా చెప్పారు. 12.30 గంటల కల్లా దవాఖానలో ఆక్సిజన్ అయిపోయిందని, 1.35 గంటలకు ఆక్సిజన్ ట్యాంకర్ దవాఖానకు వచ్చిందని పేర్కొన్నారు. ఈలోగా 12 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
‘ఇది చాలా బాధాకరమైన విషయం. ఆక్సిజన్ లేక ప్రజలు చనిపోవడం చూడలేకపోతున్నాం. ఢిల్లీకి రోజుకు 976 టన్నుల ఆక్సిజన్ కావాలి. కానీ శుక్రవారం 312 టన్నులు మాత్రమే వచ్చింది. ఇంత తక్కువ ఆక్సిజన్తో ఢిల్లీ ఎలా ఊపిరి పీల్చుకోగలుతుంది..’ అని ట్వీట్ చేశారు. కరోనా ఉద్ధృతి ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ఢిల్లీలో లాక్డౌన్ను మరో వారం పాటు పొడిగించారు. ఇదిలా ఉండగా, వసంత్ కుంజ్లోని ఫోర్టిస్ దవాఖానలో ఆక్సిజన్ కొరత కారణంగా రోగులను చేర్చుకోవడం లేదు. సెహగల్ నియో దవాఖాన కూడా ఆక్సిజన్ అయిపోయిందని తెలిపింది.
ఆక్సిజన్ ఇస్తారా.. కోర్టు ధిక్కరణ ఎదుర్కొంటారా?
బాత్రా ఘటనపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఢిల్లీకి శనివారమే 490 టన్నుల ఆక్సిజన్ను సరఫరా చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. లేకపోతే కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాలని హెచ్చరించింది. ‘ఢిల్లీలో ప్రజలు చనిపోతుంటే మేం కండ్లు మూసుకొని ఉన్నాం అని భావిస్తున్నారా?’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.