హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నిరోధించే విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ మూడు సార్లు రివ్యూ నిర్వహించి స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు శనివారం సూచించారు. రెమ్డెసివిర్ వంటి మందుల విషయంలో గానీ, వ్యాక్సిన్ల విషయంలో గానీ ఏ మాత్రం లోపం రానీయవద్దని సీఎస్కు స్పష్టంచేశారు. అనుక్షణం కరోనా పరిస్థితుల పర్యవేక్షణకు గాను సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి రాజశేఖర్రెడ్డిని ముఖ్యమంత్రి నియమించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ జాగరూకతతో వ్యవహరిస్తూ, చక్కగా పనిచేసి అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుంచి బయటపడేలాచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ప్రభుత్వ దవాఖానల్లో ఇప్పటికే ఉన్న పదివేల ఆక్సిజన్ పడకలకు అదనంగా మరో 10వేల పడకలకు ఆక్సిజన్ సరఫరా చేస్తామని సీఎస్ సోమేశ్కుమార్ తెలిపారు. దీంతో 20 వేల ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు శనివారం సీఎస్.. ముఖ్యమంత్రి కార్యదర్శి రాజశేఖర్రెడ్డితో కలిసి సీనియర్ అధికారులతో కొవిడ్ పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. గతేడాది సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని ప్రైవేటు, ప్రభుత్వ దవాఖానల్లో కలిపి 18,232 కొవిడ్ బెడ్లు ఉండగా, వాటిని 49,133కు పెంచామని, ప్రత్యేక చర్యలతో ఇప్పుడు 60 వేల బెడ్లు ఉన్నాయని తెలిపారు. కొవిడ్ పేషెంట్లకు జిల్లాల్లో కాల్సెంటర్లు, జీహెచ్ఎంసీ కాల్సెంటర్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. హోం ఐసొలేషన్లో ఉన్న వారికోసం అదనంగా మరో 5 లక్షల మెడికల్ కిట్లను తెప్పించాలని, పాజిటివ్ వచ్చినవారి ఇంటికి వాటిని హోండెలివరీ చేయాలని ఆదేశించారు. సీఎం సూచనల మేరకు నిమ్స్లో 500, సరోజినీదేవి 200, చెస్ట్ హాస్పిటల్ 50, గాంధీ 200, గోల్కొండ 100, వనస్థలిపురం 100, అమీర్పేటలో 50 బెడ్లను వారంలోగా పెంచాలన్నారు.
మందుల కొరతను అధిగమించేందుకు ఐఏఎస్ సందీప్కుమార్ సుల్తానియా ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం పనిచేస్తుందన్నారు. వ్యాక్సిన్ సరఫరా కోసం హాస్పిటళ్లు, పీహెచ్సీల్లో వాక్ఇన్ ఇంటర్వ్యూల ద్వారా ఖాళీలను భర్తీ చేయాలన్నారు. అత్యధిక డిమాండ్ ఉన్న రెమెడిసివిర్ డ్రగ్స్ను కావాల్సినంత అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం ఆదేశాల మేరకు జయేశ్రంజన్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు.
హైదరాబాద్లోని ప్రభుత్వ దవాఖానలను మానిటర్ చేసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులను, జిల్లాలోని ప్రధాన దవాఖానలను మానిటర్ చేసేందుకు కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 4.4 లక్షల డోసుల వ్యాక్సిన్ మాత్రమే తెలంగాణకు కేటాయించిందని, అయితే రాష్ట్రంలో 18 నుంచి 45 ఏండ్ల వయసు వారు 1.72 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. ఈ మేరకు మరిన్ని వ్యాక్సిన్ డోసులు కావాలని కేంద్రానికి లేఖ రాశామన్నారు. ఆక్సిజన్ కోసం ఒరిస్సాకు ఐఏఎఫ్ ఎయిర్క్రాఫ్ట్, రైల్వే ర్యాక్స్ను పంపించామని తెలిపారు.
ప్రస్తుతం రాష్ర్టానికి కేటాయించిన 430 ఎంటీల ఆక్సిజన్ బదులు 600 ఎంటీలు కేటాయించాలని కేంద్రానికి లేఖ రాశామన్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి, విపత్తు నిర్వహణ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్రోస్, ఎంఏయూడీ కమిషనర్ సత్యనారాయణ, డైరెక్టర్ డ్రగ్ కంట్రోల్ ప్రీతీమీనా తదితరులు పాల్గొన్నారు.