దామెర, జూలై 9: పల్లెప్రగతి పనులతో గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడి ఆదర్శంగా రూపుదిద్దుకుంటున్నాయని అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. మండలంలోని తక్కళ్లపహాడ్ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పల్లెప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్యార్డు, డ్రైనేజీలు, శ్మశానవాటిక, రైతువేదికను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం హరితహారంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. తక్కళ్లపహాడ్ అనతికాలంలోనే పరిశుభ్రంగా తయారైందన్నారు. ఇంటింటికీ ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకున్నారని, సీసీ కెమెరాల ఏర్పాటు, సంపూర్ణ మద్యపాన నిషేధం, పరిసరాల శుభ్రత పాటించడం వల్ల గ్రామం ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. సర్పంచ్ బింగి రాజేందర్, కార్యదర్శి మణిదీప్, ప్రత్యేకాధికారి పద్మావతి, ఏఈవో దాదాసింగ్ పాల్గొన్నారు.
వందశాతం పూర్తి చేయాలి
దుగ్గొండి: పల్లెప్రగతి పనులను నిత్యకృత్యంగా చేపట్టి వందశాతం పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ సూచించారు. లక్ష్మీపురం, దేశాయిపల్లిలో సర్పంచ్లు, అధికారులతో కలిసి ఆయన డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, పారిశుధ్య పనులను పరిశీలించారు. దేశాయిపల్లి పార్కు బాగుందని కితాబిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్లు పాండవుల సురేందర్, పీ పోశాలు, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్గౌడ్, కార్యదర్శులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అలాగే, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు చంద్రయ్యపల్లి, బల్వంతాపురం, మహ్మదాపురం, తిమ్మంపేటలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. చంద్రయ్యపల్లిలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ అభివృద్ధిలో గ్రామస్తులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఎంపీపీ కాట్ల కోమల, సర్పంచ్లు పల్లాటి భవాని, శంకేసి శోభ, తొట్ల నీలవేణి, కార్యదర్శులు పాల్గొన్నారు.
వర్మికంపోస్ట్ తయారు చేయాలి: డీపీవో
నెక్కొండ: గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరుగా సేకరించి డంపింగ్ యార్డులకు తరలించి వర్మికంపోస్ట్ ఎరువును తయారు చేయాలని డీపీవో ప్రభాకర్ సూచించారు. అప్పల్రావుపేట, వెంకటాపురం, అలంకానిపేట, నెక్కొండలోని వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, నర్సరీలను ఆయన సందర్శించారు. వెంకటాపురం జీపీలో పారిశుధ్యం లోపించినందుకు కార్యదర్శి కృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. పల్లెప్రగతి పనులను సమర్థవంతంగా నిర్వహిస్తున్న అలంకానిపేట సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మిని డీపీవో అభినందించారు. శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డుల చుట్టూ బయో ఫెన్సింగ్ వేయాలన్నారు. ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేయాలన్నారు. డీపీవో వెంట ఎంపీడీవో సాహితీమిత్ర, ఎంపీవో రవి, ఏపీఎం శ్రీనివాస్, కార్యదర్శులు కృష్ణంరాజు, నరేశ్, మధు, ఈవో గోవిందరాజు, నెక్కొండ సర్పంచ్ సొంటిరెడ్డి యమున పాల్గొన్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
నర్సంపేట: పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ కోరారు. పట్టణంలోని 7, 21, 23, 24వ వార్డుల్లో కాలనీలను పరిశీలించారు. డ్రైనేజీల్లో చెత్తాచెదారం వేయడం వల్ల మురుగునీరు నిలిచిపోతుందన్నారు. దోమలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ వచ్చినప్పుడే ట్రాక్టర్,ట్రాలీల్లో చెత్త వేయాలని కోరారు. వర్షాకాలం ప్రారంభమైనందున ప్రజలు కాచి చల్లార్చిన నీటినే తాగాలని, వేడి పదార్థాలను ఆహారంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, టీపీపీఎస్ సునీల్కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఏఈ సురేశ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పట్టణంలో అధికారులు విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తున్నారు. శిథిలమైన స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. శాంతినగర్లో ఏఈ శ్రీధర్ ఆధ్వర్యంలో వంగిపోయిన, శిథిలమైన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయించారు. వేలాడుతున్న విద్యుత్ తీగలు లేకుండా మిడిల్ పోల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ దార్ల రమాదేవి, లైన్మన్ దేవేందర్, సిబ్బంది కృష్ణ, రాజు పాల్గొన్నారు.
తాగునీటి సమస్యకు పరిష్కారం
నర్సంపేట ఆర్టీసీ కాలనీవాసుల తాగునీటి కష్టాలు తీరాయి. స్థానికంగా పైపులైన్ లేక ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. పట్టణప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు కమిటీ సభ్యులు సమస్యను గుర్తించి కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ఆధ్వర్యంలో పాత చేతిపంపునకు మరమ్మతులు చేయించారు. దీంతో కాలనీ మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వార్డు ఇన్చార్జి శ్రీనివాస్, మామిడాల భిక్షపతి, కొత్తగట్టు కుమార్ పాల్గొన్నారు.
దామెర: మండలకేంద్రంలో పార్కు స్థలాన్ని ఎంపీడీవో వెంకటేశ్వర్రావుతో కలిసి తహసీల్దార్ రియాజొద్దీన్ పరిశీలించారు. మెగా పల్లెప్రకృతి వవాన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందన్నారు. కోగిల్వాయి, దమ్మన్నపేట, సీతారాంపురం, పులుకుర్తిలో చెత్తాచెదారం, ముళ్లపొదలు తొలగించి, రోడ్డుపై ఏర్పడిన గుంతలను మొరంతో పూడ్చివేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నర్సింహమూర్తి, సర్పంచ్లు విష్ణువర్ధన్రెడ్డి, పుల్యాల రాణి, శ్రీనివాస్, గోవిందు అశోక్, శ్రీరాంరెడ్డి, ఎంపీవో యాదగిరి, కార్యదర్శి నరేశ్, కారోబార్ బొబ్బిలి పాల్గొన్నారు.
ముమ్మరంగా ‘ప్రగతి’ పనులు
పర్వతగిరి: గోపనపల్లిలో ఎంపీడీవో చక్రాల సంతోష్కుమార్ పనులను పరిశీలించారు. ఏనుగల్లులోని నాలుగో వార్డులో రోడ్లపై పీఆర్ ఏఈ కవిత, సర్పంచ్ సంధ్యారాణి ఆధ్వర్యంలో మొరం పోయించి చదును చేశారు. కొంకపాక, గోరుగుట్టతండాలో స్పెషలాఫీసర్ రవీందర్ రోడ్లకిరువైపులా మొక్కలు నాటించారు. కార్యక్రమంలో సర్పంచ్లు వర్కాల రమేశ్, కొల్లూరు వెంకన్న, కార్యదర్శులు యాకూబ్పాషా, సదానందం, దయాకర్, హుస్సేన్, ఉపసర్పంచ్ గుండారపు సతీశ్రావు, వార్డు సభ్యులు దోని దేవేందర్, మంజుల, అనూష, అనిత, ఈసీ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.
సంగెం: మండలంలో పారిశుధ్య పనులు జోరుగా సాగుతున్నాయి. సర్పంచ్లు, కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు వాడవాడలా తిరిగి సమస్యలు గుర్తించి పరిష్కరిస్తున్నారు. రోడ్లను శుభ్రం చేయడంతోపాటు డ్రైనేజీల్లో పూటిక తీస్తున్నారు. నర్సరీల్లోని మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు.
డంపింగ్యార్డుల చుట్టూ బయో ఫెన్సింగ్
శాయంపేట: కొప్పులలోని డంపింగ్ యార్డు చుట్టూ బయో ఫెన్సింగ్ పనులు చేపట్టినట్లు ఎంపీడీవో కృష్ణమూర్తి, ఎంపీవో రంజిత్ తెలిపారు. పెద్దకోడెపాక, సాదన్పల్లి, ఆరెపల్లిలోని డంపింగ్ యార్డుల చుట్టు కూడా బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డంపింగ్ యార్డుల్లో ఎరువు తయారీకి చర్యలు చేపట్టామన్నారు.
ఖానాపురం: మండలకేంద్రంలోని పెద్దమ్మగడ్డకు వెళ్లే రహదారి, కొత్తూరులో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు ఆధ్వర్యంలో మొక్క లు నాటారు. డ్రైనేజీలను శుభ్రం చేసి రోడ్లపై గుంతలు పూడ్చా రు. జడ్పీటీసీ బత్తిని స్వప్న, సర్పంచ్ బూస రమ, కొలిశెట్టి పూర్ణచందర్రావు, పోశెట్టి, నాగార్జునరెడ్డి, బొప్పిడి పూర్ణచందర్రావు, ఎంపీటీసీ బోడ భారతి, మర్రి కవిత పాల్గొన్నారు.
నడికూడ: కౌకొండలో విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేశారు. సర్పంచ్ మేకల రమేశ్ మాట్లాడుతూ వేలాడుతున్న తీగలు, వంగిన స్తంభాలను సరిచేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈ మల్లికార్జున్, ఏడీఈ జగదీశ్బాబు, నోడల్ ఆఫీసర్ రవి, ఏఈ సత్యనారాయణ, లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, లైన్మన్ శోభన్, జేఎల్ఎం ప్రశాంత్ పాల్గొన్నారు.