నస్పూర్, ఏప్రిల్ 26 : ప్రకృతిలోనే అనేక ఆవిష్కరణలుంటాయని, పరిశీలిస్తే సమస్యలు పరిష్కరించే ఆవిష్కర్తలుగా విద్యార్థులు ఎదుగుతారని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సైన్స్ కేంద్రలో వేసవి విజ్ఞాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా సైన్స్ అధికారి అధ్యక్షతన 15 రోజుల పాటు ఈ శిబిరం కొనసాగుతుందని, విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే ఆవిష్కరణలపై మక్కువ పెంచుకోవాలని సూచించారు. జిల్లా సైన్స్ సెంటర్కు అనుబంధంగా జిల్లా సైన్స్ మ్యూజి యం, పార్కు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం గురుత్వాకర్షణ శక్తి గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఈవో యాదయ్య, రిసోర్స్ పర్సన్ జాకీర్ హుస్సేన్, తిరుపతి, రాజేశం, ఉపాధ్యాయులు కృష్ణ, కుమార్, హరి ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.