కమ్మర్పల్లి, మే 21 : నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హాసాకొత్తూర్లో మలావత్ సిద్దార్థ అనుమానాస్పద మృతి కేసులో రెండో రోజైన శుక్రవారం సైతం ఉద్రిక్తత కొనసాగింది. శుక్రవారం ఉదయం కూడా మృతుడి బంధువులు, స్థానికులు నిరసన తెలిపారు. ఈ కేసు విషయంలో సమాచారం ఉన్నట్లు భావిస్తున్న గ్రామానికి చెందిన ఒక యువకుడిని స్థానికులు పిలిపించి విచారించారు. ఈ సమయంలో యువకుడిపై ఆగ్రహంతో దాడి జరుగవచ్చని, కేసు సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ యువకుడిని పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆందోళన చేస్తున్న వారు పోలీసు వాహనంపై దాడి చేశారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు గ్రామం నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేశారు.
దీంతో గొడవ పెద్దదిగా మారే అవకాశముందని భావించి పోలీసులు గ్రామం బయటికి వెళ్లారు. అనంతరం కొందరు మహిళలు హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న కనుక రాజేశ్ ఇంటిపై దాడి చేసి ఇంటిలో ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కొంత సామగ్రిని ఇంటి ముందర వేసి నిప్పంటించారు. ఈ పరిణామంతో డీసీపీ జి.శ్రీనివాస్, ఆర్మూర్ ఏసీపీ రఘు గ్రామానికి వెళ్లి మళ్లీ ఆందోళన చేస్తున్న వారితో చర్చించారు. బాధితులకు న్యాయం జరిగేందుకు పోలీసులతో సహకరించాలని కోరారు. ఈ వ్యవహారంలో సమాచారమున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పార్టీ పదవి నుంచి రాజేశ్ తొలగింపు
హాసాకొత్తూర్ గ్రామ టీఆర్ఎస్ అధ్యక్ష పదవి నుంచి కనుక రాజేశ్ను తొలగించినట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్ తెలిపారు. కమ్మర్పల్లిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హాసాకొత్తూర్కు చెందిన మలావత్ సిద్ధార్థ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాజేశ్పై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. మృతుడి కుటుంబానికి పార్టీ తరఫున సానుభూతి తెలిపారు. సమావేశంలో నాయకులు మలావత్ ప్రకాశ్, పెరుమాండ్ల రాజాగౌడ్, హల్దె శ్రీనివాస్, లోలపు సుమన్, గడ్డం స్వామి, మైలారం సుధాకర్, నోముల నరేందర్, తెడ్డు రాజన్న, బక్కూరి గోపి, మహేశ్, బద్ధం రాజేశ్వర్, మల్యాల సుభాష్ గౌడ్, అరుణ్ రెడ్డి, అవారి గంగారెడ్డి, లింగా రెడ్డి పాల్గొన్నారు.