తెలుగు సినీ చరిత్రలో కామెడీ సినిమాల ట్రెండ్కు రెడ్ కార్పెట్ పరిచిన చిత్రం అహ నా పెళ్లంట . మాయాబజార్ సినిమాలోని పాట పల్లవినే టైటిల్గా పెట్టడమే కాకుండా ఆ సినిమా టైటిల్స్ వాడుకొని వెరైటీని చూపించిన సినిమా ఇది. ఆదివిష్ణు రాసిన సత్యం గారి ఇల్లు నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి హాస్య బ్రహ్మ జంధ్యాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో రాజేంద్రప్రసాద్ కామెడీ హీరోగా అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నారు. ఈ సినిమాతోనే బ్రహ్మానందం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా నత్తివాడిగా అరగుండు పాత్రలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ పాత్ర పరమ పిసినారి లక్ష్మీపతి. ఆ పాత్రలో కోట శ్రీనివాసరావు జీవించేశాడు.
దూలానికి కోడిని కట్టేసి.. దాన్ని చూసుకుంటూ వట్టి అన్నం తిని చికెన్ కూర తింటున్నట్టు ఫీలవ్వడం.. బట్టలను పొదుపు చేసేందుకు పేపర్ చుట్టుకుని పడుకోవడం ఇలా ఒక్కటేంటి స్క్రీన్పై కనిపించే ప్రతి సన్నివేశంలోనూ తన నటనతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు కోట. ఇప్పటికీ ఆ సీన్లు చూస్తే నవ్వు వస్తూనే ఉంటుంది. ఆ పాత్రను తాను తప్ప ఇంకెవరూ చేయలేరేమో అన్నంతగా పిసినారి లక్ష్మీపతి పాత్రలో జీవించేశాడు కోట. అలాంటి గొప్ప పాత్రను కోట శ్రీనివాసరావుతో చేయించడానికి ఆ చిత్ర నిర్మాత రామానాయుడు ఒప్పుకోలేదంట. కానీ కోట తప్ప ఆ పాత్రకు మరెవరూ సెట్ కారని జంధ్యాల పట్టుబట్టడంతో చివరకు రామానాయుడు ఒప్పుకున్నాడంట. ఈ విషయాన్ని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు తెలిపారు.
అహ నా పెళ్లంట సినిమాలో హీరోకు ధీటైన పాత్ర పిసినారి లక్ష్మీపాత్ర. ఈ పాత్రను జంధ్యాల ఓ రేంజిలో తీర్చిదిద్దాడు. ఈ పాత్ర సక్సెస్ అయితేనే సినిమా హిట్ అవుతుందని జంధ్యాల భావించాడు. లేదంటే పరాజయం తప్పదని నిర్మాత రామానాయుడుకు చెప్పేశాడు జంధ్యాల. అలాంటి గొప్ప పాత్రకు కోట శ్రీనివాసరావును తీసుకుందామని జంధ్యాల ఫిక్స్ అయ్యాడు. అప్పటికే మండలాధీశుడు సినిమా విడుదల కావడం.. ఆ సినిమాలో కోట నటనను చూసి జంధ్యాల ఈ నిర్ణయానికి వచ్చాడు. కానీ రామానాయుడు కోటను ఒప్పుకోలేదు. సినిమా మొత్తంలో పిసినారి లక్ష్మీపతి పాత్రనే కీలకం కావడంతో రావుగోపాలరావు వంటి సీనియర్ నటుడితో ఆ పాత్ర చెప్పిద్దామని అనుకున్నాడు. కానీ జంధ్యాల మాత్రం కోటను తప్ప ఇంకెవర్నీ లక్ష్మీపతి పాత్రకు ఒప్పుకోలేదు. ఈ విషయంపై రామానాయుడు, జంధ్యాల మధ్య దాదాపు 20 రోజుల పాటు వాదించుకున్నారు. చివరకు పట్టుబట్టి రామానాయుడిని జంధ్యాల ఒప్పించారు.
ఒకరోజు చెన్నై వెళ్లడానికి కోట శ్రీనివాసరావు ఎయిర్పోర్టుకు వెళ్తే అక్కడ ఆయనకు రామానాయుడు కనిపించారు. అక్కడ కోటను చూసిన రామానాయుడు.. ఇక్కడకు రావయ్యా నీతో ఓ విషయం చెప్పాలని పిలిచాడు. జంధ్యాలతో ఓ సినిమా ప్లాన్ చేశా అని, అందులో లక్ష్మీపతి పాత్ర గురించి కోటకు చెప్పాడు. జంధ్యాలతో జరుగుతున్న వాదన గురించి కూడా వివరించాడు. వాదన ఎందుకండీ ఈ క్యారెక్టర్కు రావు గోపాలరావే న్యాయం చేస్తాడని కోట బదులిచ్చాడు. కానీ రావుగోపాలరావుకు ఎంత మేకప్ వేసినా ఆయన ముఖ్యంలో ప్యూర్నెస్ రాదని జంధ్యాల అంటున్నారని రామానాయుడు కోటతో అన్నాడు. ఏం చెప్పాలో అర్థంకాక సందిగ్ధంలో ఉన్న కోటకు.. ఆ పాత్రను నువ్వే చేయాలని బంపర్ ఆఫర్ ఇచ్చేశాడు రామానాయుడు. ఆ పాత్ర ఎలా చేస్తావో నీ ఇష్టం.. కానీ ఆ పాత్ర అద్భుతంగా చేస్తే నీ దశ మారిపోతుందని చెప్పాడు. ఆ మాటలను దృష్టిలో పెట్టుకున్న కోట.. పరమ పిసినారి లక్ష్మీపతి పాత్రలో జీవించేశాడు. దీంతో కోటకు నటుడిగా మంచి పేరు దక్కింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
చెప్పిన డేట్కి వస్తున్న మెగాస్టార్
23 ఏళ్ళ కిందే సినిమాలు వదిలేద్దాం అనుకున్నా: పవన్ కళ్యాణ్
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత