గజ్వేల్/ములుగు/వర్గల్, జూన్14: జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణంతో నిర్వాసితులుగా మారిన వారి కోసం నిర్మించిన పునరావాస కాలనీలు ఎంతో బాగున్నాయని, అక్కడ అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిందని, నిర్వాసితులు అక్కడ ఎంతో సంతోషంగా జీవిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. గజ్వేల్ పట్టణంతోపాటు ములుగు, వర్గల్ మండలాల్లో సోమవారం పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. తున్కిబొల్లారం, ముట్రాజ్పల్లి ఆర్అండ్ఆర్ కాలనీలు ఎంతో బాగున్నాయని అన్నారు. నిర్వాసితుల కోసం ఇచ్చిన హామీ మేరకు అన్ని వసతులతో కాలనీలను చాలా అద్భుతంగా సీఎం కేసీఆర్ నిర్మింపజేశారని తెలిపారు.
వర్గల్లో ఫుడ్ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు స్థల పరిశీలన…
వర్గల్ మండల పరిధిలో 900 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు స్థలాన్ని సీఎస్ సోమేశ్కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ పరిశీలించారు. ఇందుకు సంబంధించిన భూముల వివరాలను, పరిశ్రమల నిర్మాణం గురించి కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి మ్యాప్ ద్వారా వారికి క్షుణ్ణంగా వివరించారు. తున్కిబొల్లారం, ముట్రాజ్పల్లి ఆర్అండ్ఆర్ కాలనీవాసులతోపాటు జిల్లా నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం వర్గల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
గజ్వేల్ సమీకృత మార్కెట్ బాగుంది…
సీఎం కేసీఆర్ గజ్వేల్లో నిర్మించిన వెజ్, నాన్వెజ్ సమీకృత మార్కెట్ చాలా బాగుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కితాబునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ తరహా నిర్మించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల అడిషనల్ కలెక్టర్లతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులను గజ్వేల్ సమీకృత మార్కెట్ను సందర్శించేలా ఆదేశిస్తామన్నారు. ఎంతో ఆహ్లాద కరమైన వాతావరణంలో గాలి,వెలుతురు వచ్చే విధంగా, దుర్వాసన వచ్చే ఆస్కారం లేకుండా గజ్వేల్ సమీకృత మార్కెట్ నిర్మాణం చేపట్టారని సీఎస్ తెలిపారు. కలెక్టర్ల సమావేశంలో ఈ మార్కెట్ ప్రత్యేకతల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తామన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (ఎన్ఐఆర్డీ)లో గజ్వేల్ మోడల్ మార్కెట్ నిర్మాణం, ప్రత్యేకతల గురించి వివరించి ప్రజాప్రతినిధులకు, అధికారులకు అవగాహన కల్పిస్తామన్నారు. సమీకృత మార్కెట్లోని కూరగాయ వ్యాపారులతో సీఎస్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఎప్పుడు దుకాణాలు తెరుస్త్తారు, రోజుకు ఎంత వ్యాపారం చేస్తున్నారు. గిట్టుబాటు అవుతుందా అని అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్కు సీఎస్ అభినందనలు..
సమీకృత మార్కెట్ మంచి ఆర్కిటెక్తో సుందరంగా, సౌలభ్యంగా నిర్మించినందుకు, ఆర్అండ్ఆర్ కాలనీల నిర్మాణాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు కలెక్టర్ వెంకట్రామ్రెడ్డిని సీఎస్ అభినందించారు. కలెక్టర్తో పాటు అధికారులంతా సమన్వయంతో పనిచేసి జిల్లాలో గొప్పగొప్ప విజయాలను సాధించారన్నారు. అంతకు ముందు వంటిమామిడి హార్టికల్చర్ యూనివర్సిటీ వద్ద పుష్పగుచ్ఛంతో సీఎస్కు కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, అదనపు కలెక్టర్ ముజామిల్ఖాన్, ఆర్డీవో విజయేందర్రెడ్డి స్వాగతం పలికారు. గజ్వేల్ సమీకృత మార్కెట్ వద్ద మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్ద్దన్, కమిషనర్ వెంకటగోపాల్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గోపాల్రెడ్డి, మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పద్మ హర్ష, అడిషనల్ డైరెక్టర్ రవికుమార్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ బట్టు సుధాకర్రెడ్డి, డైరెక్టర్లు, ఏఎంసీ కార్యదర్శి జాన్వెస్లీ, సూపర్వైజర్ మహిపాల్, సిబ్బంది పాల్గొన్నారు.