కొత్తగూడెం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రానున్న రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు కార్యస్థానాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంరక్షణ, సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. అత్యవసర సేవలకోసం ప్రజలు ఏ సమయంలో నైనా ఫోన్ చేయవచ్చని ఆయన చెప్పారు.
కంట్రోల్ రూం సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో 08744-249150, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 08743-232444తో పాటు ఫోటోలు, వీడియోలు పంపేందుకు ప్రత్యేకంగా 9392919743 వాట్సాప్ చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో డీఆర్వో అశోక చక్రవర్తి, డీపీవో రమాకాంత్, పశుసంవర్ధక అధికారి పురందర్, మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.