అమరావతి : విశాఖపట్నంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. మధురవాడ మిథిలాపురి కాలనీకి చెందిన ఆదిత్య టవర్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్లోని ఐదో అంతస్థులో గత ఎనిమిది నెలలుగా ఎన్ఆర్ఐ కుటుంబం ఉంటోంది. ఈ క్రమంలో కుటుంబంలోని నలుగురు వ్యక్తులు గురువారం అనుమానాస్పద స్థితిలో సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. మృతులను బంగారు నాయుడు(50), నిర్మల(46), దీపక్(22), కశ్యప్(19) గా గుర్తించారు. సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే, ఆత్యహత్య చేసుకున్నారా? లేదంటే ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతులు విజయనగరం జిల్లా గంట్యాడ వాసులుగా గుర్తించారు. బహ్రెయిన్లో స్థిరపడి నాలుగేళ్ల క్రితం విశాఖపట్నం వచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.