న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కొనసాగుతున్న మహా కుంభమేళా ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని, కొవిడ్ కేసులు పెరుగుతున్న వేళ కుంభమేళాను నిలిపివేసేందుకు ఎలాంటి చర్చలు జరుగలేదని అధికారులు తెలిపారు. రెండువారాల ముందుగానే కార్యక్రమాన్ని ముగించే చర్యలను ఖండించారు. వాస్తవానికి కుంభమేళా జనవరిలో ప్రారంభమయ్యేది. కానీ, కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి ఏప్రిల్లో నిర్వహించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో కుంభమేళాను కేంద్రం కుదించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై ఎలాంటి సమాచారం అందలేదని కుంభమేళా అధికారి దీపత్ రావత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, మత పెద్దల మధ్య చర్చలు జరిగాయి, కార్యక్రమం రద్దుకు అంగీకారం తెలుపలేదు. ఇదిలా ఉండగా.. గంగానది ఒడ్డున జరుగుతున్న కుంభమేళా కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు.
ఈ క్రమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు వస్తున్న భక్తులు పెద్ద ఎత్తున కరోనా మహమ్మారి బారినపడుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రద్దీ లేని ఘాట్లలో సామాజిక దూరాన్ని అనుసరించనందుకు భక్తులకు జరిమానా విధిస్తున్నారు. కానీ, ప్రధాన ఘాట్లలో రద్దీగా ఉన్న చోట్ల జరిమానాల విధింపు చాలా కష్టమని పోలీస్ అధికారి సంజయ్ గుంజ్యాల్ పేర్కొన్నారు. కుంభమేళాలో ఈ నెలలో మరో ముఖ్యమైన తేదీ 27. ఆ రోజు పెద్ద ఎత్తున భక్తులు ‘షాహీ స్నానాలు’ చేసేందుకు వస్తారని అంచనా.
అయితే, ఈ ఏడాది మతపరమైన సమావేశాలు విరమించకూడదనే నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశం ఉండడంతో సూపర్ స్ప్రేడర్గా మారే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అయితే, కుంభమేళాను నిర్వహణను విరమించుకునేందుకు అఖాదాస్, సీర్ గ్రూపులు నిరాకరించాయి. హర్కీ పౌరి ఘాట్ వద్ద స్నానాలు చేసే భక్తులు సామాజిక దూరం పాటించపోవడం, మాస్క్ ధరించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. బుధవారం ఒకే రోజు ఉత్తరాఖండ్లో 2,167 మంది కొవిడ్ బారినపడ్డారు. ఇందులో 525 మంది హరిద్వార్లో పాజిటివ్గా పరీక్షించారు.
ఇవికూడా చదవండి..