శ్మశానాలకు రోజూ వందల మృతదేహాలు
కిలోమీటర్ల మేర అంబులెన్సుల బారులు
ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్లో హృదయవిదారక దృశ్యాలు
న్యూఢిల్లీ/అహ్మదాబాద్/భోపాల్: మరణించిన ఆత్మీయుల కడసారి చూపుకు నోచుకోని కుటుంబసభ్యులు ఒకవైపు, మృతదేహాలను తీసుకొచ్చి వంతుకోసం స్తబ్దుగా ఎదురుచూస్తున్న అంబులెన్సులు మరోవైపు, అంత్యక్రియలను జరిపేందుకు శ్మశానంలో జాగాలేక నిస్సహాయ స్థితిలో అధికారులు ఇంకోవైపు.. దేశంలో కరోనా సృష్టిస్తున్న ఘోరకలికి గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్లో కనిపిస్తున్న ఇలాంటి దృశ్యాలే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గుజరాత్లోని వడోదరా, సూరత్, అహ్మదాబాద్ తదితర నగరాల్లోని పలు శ్మశాన వాటికలు కరోనా మృతదేహాల గుట్టలతో నిండిపోతున్నాయి. ఒక్కో శ్మశాన వాటికకు రోజులో వందకుపైగా మృతదేహాలు వస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొవిడ్ మృతులతో అంబులెన్సులు శ్మశానాల ముందు కిలోమీటర్ల మేర బారులు తీరడం నిత్యకృత్యంగా మారుతున్నది. రోగులను తీసుకొచ్చే అంబులెన్సులతో గుజరాత్లోని దవాఖానలు రద్దీగా మారాయి. ఢిల్లీలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. నగరంలోని ప్రధాన శ్మశాన వాటికల్లో రోజుకు సగటున గరిష్ఠంగా 50-60 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించగలమని, అయితే ప్రస్తుతం రోజూ వందకు పైగా మృతదేహాలు వస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్టు స్థానిక యంత్రాంగం చెబుతున్నది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్తో పాటు పలు ప్రాంతాల్లోని శ్మశానాలకు కరోనా మృతదేహాలు పోటెత్తుతుండటంతో జాగా లేక అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.