న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న రోజువారీ కేసుల్లో పెరుగుద ల రేటు చాలా ఆందోళనకరంగా ఉంద ని, వైరస్ వ్యాప్తి ఇలాగే కొనసాగితే రోజుకు 3 లక్షల కంటే ఎక్కువ మంది మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉందని ప్రముఖ వైరాలజిస్టు షాహిద్ జమీల్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సెకండ్ వేవ్ మే నెల చివరి దాకా ఉంటుందని అంచనా వేశారు. కొత్త రకం వైరస్లు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వైరస్ల వ్యాప్తి బాగా ఉన్నప్పటికీ మరణాలు తక్కువే ఉన్నాయన్న వాదనను ఆయన ఖండించారు. అలా చెప్పడానికి ప్రస్తుతం కచ్చితమైన సమాచారం ఏదీ లేదన్నారు. దేశంలో వ్యాక్లిన్లకు కొరత ఉందన్న ఆరోపణలను జమీల్ కొట్టిపారేశారు. ‘సీరమ్ సంస్థ నెలకు 6 కోట్ల టీకాలు, భారత్ బయోటెక్ 3 కోట్ల టీకాలను ఉత్పత్తి చేస్తున్నది. ఇప్పటివరకు 32 కోట్ల టీకాలు ఉత్పత్తి అయ్యాయి. వాటిలో మనం 12 కోట్లు వినియోగించాం. 6.5 కోట్లు ఎగుమతి చేశాం. అంటే ఇంకా 10 కోట్లకు పైగా టీకాలు ఉన్నాయి. టీకాలకు కొరత లేదు. ఇది సరఫరా సమస్య’ అని పేర్కొన్నారు.
దేశంలో చాలా మంది టీకా వేసుకోకపోవడానికి వ్యాక్సినేషన్ ప్రారంభించిన సమయం కూడా ఒక కారణమని జమీల్ అభిప్రాయపడ్డారు. ‘కరోనా ఉద్ధృతి తక్కువ ఉన్న సమయంలో వ్యాక్సినేషన్ ప్రారంభించాం. టీకాలకు వేగంగా అనుమతులిచ్చారని ప్రజల్లో భయాలున్నాయి. దానికి తోడు కేసులు తక్కువ కావడంతో వైరస్ పోయిందనుకొన్నారు. అందుకే ప్రజలు మొదట్లో టీకా వేసుకోలేదు’ అని చెప్పారు.
దేశంలో కరోనా అంతకంతకూ విజృంభిస్తున్నది. రోజువారీ కేసుల్లో రోజూ కొత్త రికార్డు నమోదవుతున్నది. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,84,372 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,027మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,38,73,825కు పెరిగింది. మరణాల సంఖ్య 1,72,085కు చేరింది. క్రియాశీలక కేసులు 13,65,704కు చేరుకొన్నాయి. రికవరీ రేటు 88.92కు పడిపోయింది.