హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): కొందరి నిర్లక్ష్యం అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నది. కొన్ని ప్రాణాలను దహించి, కోట్ల రూపాయల ఆస్తిని బుగ్గిచేస్తున్నది. గడిచిన రెండేండ్ల (2019, 2020)లో రాష్ట్రవ్యాప్తంగా 8,855 అగ్నిప్రమాదాలు సంభవించాయి. పొగరాయుళ్లు సిగరెట్, బీడీ తాగిన తర్వాత పీకలను నిర్లక్ష్యంగా నిప్పు ఆర్పకుండా పారవేయడమేనని ఈ ప్రమాదాలకు కారణమని తేలినట్టు రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ వెల్లడించింది. బుధవారం నుంచి అగ్నిమాపకశాఖ వారోత్సవాలు మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలో అగ్ని ప్రమాదాలు, కారణాలు తదితర అంశాలను ఆ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా రెండేండ్లలో 174 మంది ప్రాణాలను అగ్నిప్రమాదాల నుంచి కాపాడినట్టు అధికారులు తెలిపారు. రెండేండ్లలో 16,859 ఫైర్కాల్స్ వచ్చాయని, వాటిలో తీవ్రమైన అగ్నిప్రమాదాలు 207 వరకు ఉన్నాయని పేర్కొన్నారు. స్వల్ప అగ్నిప్రమాదాలు 15,345, మీడియం ప్రమాదాలు 433, రెస్క్యూకాల్స్ 874 వరకు ఉన్నట్టు వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పాట్కు చేరడం, చాకచక్యంగా వ్యవహరించడంతో 2019లో రూ.770.468 కోట్లు, 2020లో రూ.959.85 కోట్ల మేర ఆస్తినష్టాన్ని నివారించినట్టు వివరించారు. ఎలక్ట్రికల్ పరికరాల కారణంగా రెండేండ్లలో 4,718 ప్రమాదాలు జరిగాయని తెలిపారు.