CNG pump : ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక సీఎన్జీ పంపులో పేలుడు కారణంగా ఒకరు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని టిక్రి కలాన్ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 3.37 గంటలకు జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల్ని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. మధ్యాహ్నం ఒక ట్రక్కులో సీఎన్జీ (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) నింపుతుండగా.. ట్రక్కు గ్యాస్ ట్యాంక్ ఉన్నట్లుండి పేలిపోయింది.
ఈ ఘటనలో పక్కనే ఉన్న ఒక వ్యక్తి మరణించాడు. మరో ఐదుగురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న సహాయక బృందాలు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నాయి. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్తితికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడిని అదే సీఎన్జీ పంపులో పని చేస్తున్న మనీష్గా గుర్తించారు. ఫైర్ సిబ్బంది, ఆరు అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్తలానికి చేరుకుని మళ్లీ ప్రమాదం జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాయి. అయితే, ట్రక్కు గ్యాస్ ట్యాంక్ పేలడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ప్రస్తుతం ఆ ట్రక్కును స్వాధీనం చేసుకున్న అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. అలాగే, సీఎన్జీ పంపును కూడా తనిఖీ చేస్తున్నారు. సీఎన్జీ పంపులో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలపై ఆరా తీశారు. ఈ ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని అధికారులు వివరించారు.