అమరావతి : విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన ఓ కుటుంబం గత కొద్ది నెలల కిత్రం గ్రామానికి వచ్చింది. కొద్ది రోజులుగా పక్కనే ఉంటున్న కుటుంబంతో కక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బత్తిన అప్పలరాజు గురువారం ఉదయం మాటు వేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వారిని కిరాతకంగా హత్య చేశాడు.
మృతుల్లో మూడేళ్ల, ఐదేళ్ల చిన్నారులు ఇద్దరు ఉన్నారు. హత్యా ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. కుటుంబమంతా రక్తపు మడుగులో పడి ఉండడం విషాదం నెలకొంది. హత్యకు పాల్పడ్డ నిందితుడు పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. అయితే, హత్యకు గల కారణాలు, మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. వివరాలను గుర్తించే పనిలో పనిలో నిమగ్నమయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.