చుంచుపల్లి, ఆగస్టు 18 : చుంచుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 108 అత్యవసర వైద్యం సేవల సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేశారు. చుంచుపల్లి నివాసి అజ్మీర మోహన్ (38) సోమవారం రాత్రి ఇంటికి వెళ్తుండగా పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయమై అధిక రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించగా, ఈఎంటీ స్రవంతి, పైలట్ సాంబశివరావు వేగంగా సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించారు. రక్తస్రావాన్ని అదుపు చేసి మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమయానికి స్పందించి బాధితుడి ప్రాణాపాయం తప్పించిన 108 సిబ్బంది సేవలను స్థానికులు, కుటుంబ సభ్యులు ప్రశంసించారు.