అమరావతి : కరోనా కారణంగా మార్చిన ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను పునరుద్ధరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కార్యాలయాలు పనిచేస్తాయని తెలిపింది. సచివాలయం, విభాగాధిపతులు, కార్పొరేషన్ల కార్యాలయాలకు ఇవే పనివేళలు వర్తిస్తాయని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. జిల్లా కార్యాలయాలకు ఆదివారం, రెండో శనివారం సెలవు ఉంటుందని వెల్లడించింది. సచివాలయం, విభాగాధిపతులు, కార్పొరేషన్ల కార్యాలయాలకు వారానికి రెండ్రోజులు సెలవులు ఉంటాయి. ఈ కార్యాలయాలు మరో ఏడాదిపాటు వారానికి ఐదురోజులే పనిచేస్తాయని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గడంతో ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను పునరుద్ధరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది.