BPCL Q4 | కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థ బీపీసీఎల్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం నికర లాభాలు 35 శాతం తగ్గిపోయాయి. 2022-23 మార్చి త్రైమాసికంలో రూ.6,478 కోట్ల నికర లాభం గడిస్తే, గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నికర లాభం రూ.4,224 కోట్లకు పరిమితమైంది. మార్కెట్ వర్గాలు బీపీసీఎల్ రూ.5,325 కోట్ల నికర లాభం గడిస్తుందని అంచనా వేశాయి.
అయితే 1:1 నిష్పత్తి కింద ప్రతి వాటాదారుడికి బోనస్ ఇవ్వాలని బీపీసీఎల్ నిర్ణయించింది. అంటే ఇప్పటికే ఇన్వెస్టర్లుగా కొనసాగుతున్న వారికి అదనంగా మరో షేర్ కేటాయిస్తారు. బీపీసీఎల్ కంపెనీ ఆదాయం స్వల్పంగా తగ్గి రూ.1.33 లక్షల కోట్ల నుంచి రూ.1.32 లక్షల కోట్లకు పడిపోయింది. ప్రతిపాదిత బోనస్ చెల్లింపునకు జూన్ 22 రికార్డు తేదీగా నిర్ణయించింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో బీపీసీఎల్ నికర లాభం రూ.26,673 కోట్లు. 2022-23లో రూ.1,870 కోట్లతో పోలిస్తే పలు రెట్లు ఎక్కువ. కానీ ఆదాయం మాత్రం రూ.5.33 లక్షల కోట్ల నుంచి రూ.5.06 లక్షలకు పడిపోయింది. ఫలితంగా ఎన్ఎస్ఈలో బీపీసీఎల్ షేర్ 4.5 శాతం పతనంతో రూ.592.25 వద్ద స్థిర పడింది.