rema rajeshwari | రెమా రాజేశ్వరి.. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ హోదాలో సంప్రదాయ కళలు, చిన్నచిన్న కథల సాయంతో చేపట్టిన ఫేక్ న్యూస్ వ్యతిరేక ప్రచారం ‘ఫోర్బ్స్’ పత్రికను ఆకట్టుకుంది. కేరళలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, స్వశక్తితో ఈ స్థాయికి చేరుకున్న రాజేశ్వరిని ‘సెల్ఫ్మేడ్ ఉమెన్’ (selfmade woman ) గా గుర్తించింది. తాజా సంచికలో ఆమె విజయగాథను ప్రచురించింది. ఆ కథనం సంక్షిప్తంగా..
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ, సోషల్ మీడియా వేదికగా ఎన్నో పుకార్లు. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, పిల్లా పాపలను భుజాన వేసుకొని వందల కిలోమీటర్ల ప్రయాణానికి పూనుకున్నారు వలస జీవులు. అందులోనూ, అక్షరాస్యత తక్కువగా ఉన్న జోగులాంబ గద్వాల జిల్లాలో ‘ఫేక్ న్యూస్’ అర్థంలేని అపోహలను సృష్టించాయి. ఆ సమయంలో జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న రెమా రాజేశ్వరి తనదైన శైలిలో నకిలీ వార్తలకు చెక్ పెట్టారు, ప్రజల్లో ధైర్యం నింపారు. ‘కరోనా వస్తే మరణమే’ అన్న దుష్ప్రచారంతో రోగులకు సాయం చేయడానికి కూడా ఎవరూ ముందుకురాని పరిస్థితుల్లో.. పోలీసు బృందాలను రంగంలోకి దించారు. అన్ని గ్రామాల్లో కరోనాపై అవగాహన కల్పించారు. స్థానిక కళాకారులతో సందేశాత్మక వీధి నాటికలు ప్రదర్శించారు. కొవిడ్ జాగ్రత్తలు, మాస్క్ అవసరం, పరిశుభ్రత ప్రాధాన్యం, పోషకాహారం.. వంటి అంశాలపై చిన్నచిన్న వీడియోలు రూపొందించారు. అవి సామాన్యులకు చేరేలా చొరవ తీసుకున్నారు. ఆ పోరాటంలో.. యువకులు, డ్వాక్రా మహిళలను భాగం చేశారు. లాక్డౌన్ నియమాలు కఠినతరం కావడంతో కూలీలు, కార్మికులు హైదరాబాద్ నుంచి సొంతూళ్ల బాటపట్టారు. మహబూబ్నగర్ మీదుగా వెళ్లే 44వ జాతీయ రహదారిపై ఎక్కడ చూసినా కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ వలస జీవులే. ఆ ఆకలి బాధలు చూడలేక, తన బృందంతో కలిసి హైవే వెంట ఫుడ్ బ్యాంక్లను ఏర్పాటు చేశారు. ఆహారం, నీళ్లు అందించారు. క్వారంటైన్ కేంద్రాలు పెట్టించారు. దాదాపు పదకొండు వేల మందిని స్వస్థలాలకు చేర్చారు.
రాజేశ్వరి స్వస్థలం కేరళలోని ఇడుక్కి జిల్లా. కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేశారు. ఆ జిల్లా నుంచి ఐపీఎస్ సాధించిన మొదటి మహిళ తనే. 2016 అమెరికా ఎన్నికల సమయం నుంచీ తప్పుడు వార్తలపై లోతైన అధ్యయనం చేస్తున్నారామె. నకిలీల మూలాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో వాస్తవాలను జనంలోకి తీసుకెళ్లడం ద్వారా అసత్యాలను అరికట్టవచ్చని అంటారు. ‘ప్రపంచ దేశాలతో పోలిస్తే.. మన దగ్గర ఫేక్ న్యూస్ ఎక్కువే. వ్యక్తి స్థాయిలో మనం.. నకిలీ వార్తలు అందిన వెంటనే డిలీట్ చేయడం ద్వారా ఆ ప్రవాహాన్ని ఆపవచ్చు’ అంటారామె. ప్రస్తుతం రాజేశ్వరి తదుపరి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.
లాక్డౌన్ సమయంలోనే ఓ సంఘటన జరిగింది. ‘మహబూబ్నగర్లో ఉంటున్న మా అక్క మూడు రోజుల నుంచీ ఫోన్ తీయడం లేదు. ఆమె భర్త మంచివాడు కాదు. నిత్యం చిత్రహింసలు పెడతాడు. దయచేసి సాయం చేయండి’ అంటూ కాన్పూర్కు చెందిన ఓ మహిళ ఎస్పీ రాజేశ్వరికి ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకుంది. తక్షణం తన బృందంతో అక్కడికి వెళ్లిన రాజేశ్వరికి బాధితురాలు రక్తమోడుతూ కనిపించింది. ఆ శాడిస్టు భర్త మూడు రోజులుగా నరకం చూపిస్తున్నాడు. బాధితురాలిని దవాఖానలో చేర్పించి, ఆ దుర్మార్గుడిని కటకటాల వెనక్కి పంపింది. ఆ సంఘటన తర్వాత రాజేశ్వరి గృహహింస బాధితుల కోసం ‘మొబైల్ సేఫ్టీ వెహికిల్’ను ఏర్పాటు చేశారు. ఆ సంచార వాహనంలో సుశిక్షిత సిబ్బంది ఉంటారు. గృహహింస బాధితులను గుర్తించి సాయం చేస్తారు. ఈ ప్రయోగం మంచి ఫలితాన్ని ఇచ్చింది. తొలి రెండు వారాల్లోనే 40 గృహహింస కేసులు నమోదు చేసి, బాధితులకు విముక్తి కల్పించారు రాజేశ్వరి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇంట్లో చెప్పకుండానే నటించా.. సినిమా విడుదలయ్యాక నాన్నకు తెలిసి..
ఎక్కడ మైక్ పెట్టినా హలో హలో మైక్ టెస్టింగ్ అంటుండె.. అది చూసి పాట పాడిస్తుండె
వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె.. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి?
custard apple | సీతాఫలాలతో ఐస్క్రీమ్లు తయారు చేస్తున్న పాలమూరు మహిళలు..
jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !