కరీంనగర్ కార్పొరేషన్, జూలై 25 : కరీంనగర్లో శాంతిభద్రతలు గాడి తప్పాయని, వరుస దోపిడీలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం శోచనీయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నగరంలోని భగత్నగర్ చౌరస్తాలో ఇటీవల దోపిడీకి గురైన మున్నాభాయ్ కుటుంబాన్ని శనివారం ఆయన పరామర్శించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూన్ నెలలోనే తమ కారు చోరీ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఎమ్మెల్యే ఎదుట వాపోయారు. అప్పుడే స్పందించి కారు దొంగలను గుర్తించి ఉంటే, ఇప్పుడు భారీ దోపిడీ జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ వారం రోజుల్లోగా నిందితులను అరెస్ట్ చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కారు ఎత్తుకెళ్లిన దుండగులే పథకం ప్రకారం వచ్చి, కుటుంబ సభ్యులపై దాడి చేసి, సుమారు 62 తులాల బంగారం, రూ.25 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. బాధితులు అనుమానిస్తున్న వ్యక్తుల సీసీటీవీ ఫుటేజీ ఫొటోలను అందించినప్పటికీ పోలీసులు నిందితులను పట్టుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. తాను పుట్టి పెరిగిన కరీంనగర్లో ఏనాడూ ఇలాంటి దుర్ఘటనలు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్ దోపిడీ దొంగలకు అడ్డాగా మారిందని, దేశవ్యాప్తంగా దొంగల దృష్టి ఈ నగరంపై పడిందంటే అది పూర్తిగా పోలీసుల వైఫల్యమేనని స్పష్టం చేశారు. గతంలో పీఎంజే జ్యువెలర్స్లో పట్టపగలే తుపాకులతో వచ్చి దోపిడీ చేసిన నిందితులను పట్టుకోవడంలో అలసత్వం ప్రదర్శించారని, ఇప్పటి వరకు సొత్తు రికవరీ చేయకపోవడం దారుణమన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, వాహనాల తనిఖీలపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడే దొంగల ఏరివేతపై పోలీసులకు ఉండట్లేదని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వినాయక మండపాల ఏర్పాటును అడ్డుకోవడం, విగ్రహాలు ఎత్తుకెళ్లిన నిందితులను పట్టుకోలేకపోవడం లాంటి ఘటనలు కేవలం కరీంనగర్ పోలీసులకే చెల్లాయన్నారు. గతంలో కరీంనగర్ సేఫ్ నగరంగా ఉండేదని, అర్ధరాత్రి వేళల్లోనూ మహిళలు స్వేచ్ఛగా తిరిగే వాతావరణం ఉండేదని, కానీ నేడు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. ఈ ఘటనపై కరీంనగర్ టౌన్ ఏసీపీకి ఫోన్ చేసి కేసు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అలాగే, భయాందోళనలో ఉన్న బాధిత కుటుంబానికి పోలీస్ శాఖ తక్షణమే తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ మేయర్ రవీందర్సింగ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్, నాయకులు సుంకిశాల సంపత్రావు, జీపీ స్వామి, తదితరులు పాల్గొన్నారు.