jai bhim | భాగ్యవతిది కూడా ‘జై భీమ్’ చిత్రంలో చినతల్లి పాత్రను తలపించే కథే. ఇద్దరు కూతుళ్ల మరణానికి కారణమైన మృగాళ్లను ఉరితీయాలంటూ ఆ దళిత మహిళ ఐదేండ్లుగా పోరాడుతూనే ఉన్నది. ఎప్పట్లానే న్యాయ దేవత తక్కెడ పెద్దలవైపే తూగింది. అయినా, భాగ్యమ్మ నిరాశపడలేదు.
కేరళలోని పాలక్కడ్ జిల్లా వలయార్ ప్రాంతానికి చెందిన భాగ్యవతికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. 2017లో భార్యాభర్తలిద్దరూ కూలీపనికి వెళ్లొచ్చే సమయానికి.. పదమూడేండ్ల పెద్ద కూతురు తాము ఉంటున్న షెడ్డులో శవమై కనిపించింది. పోస్ట్మార్టమ్ నివేదికలో ఆ బాలిక లైంగిక దాడికి గురైనట్లు వెల్లడైంది. అదే సమయంలో ఇంట్లోంచి ఇద్దరు మగవాళ్లు బయటికి రావడాన్ని కండ్లారా చూశానని భాగ్యమ్మ చిన్న కూతురు పోలీసులకు చెప్పింది. ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులకే చిన్న కూతురు కూడా అదే ఇంట్లో శవమై వేలాడింది. అప్పటి నుంచీ తమకు న్యాయం కావాలంటూ భాగ్యవతి తిరగని చోటు లేదు. రెండేండ్ల క్రితం, పోక్సో ప్రత్యేక కోర్టు నిందితులను నిర్దోషులుగా భావించి విడుదల చేసింది. ఆ బాలికలు ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించింది. అయినా ఆ తల్లి వెనక్కి తగ్గలేదు. ఆ పట్టుదలకు, గత ఏడాది సీబీఐ రంగంలో దిగింది. రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి, విచారణ మొదలుపెట్టింది. తమ విషయంలో పాలకుల నిర్లిప్తతకు నిరసనగా.. గత ఎన్నికల్లో సీఎం పినరయి విజయన్కు వ్యతిరేకంగా నామినేషన్ కూడా వేసిందామె. అలా, ఒక దళిత కుటుంబం న్యాయం కోసం ఎదురు చూస్తున్నదని ముఖ్యమంత్రికి తెలిసేలా చేసింది. ‘సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు వేచి చూస్తాం. నా కూతుళ్లను కిరాతకంగా చంపారన్నది వాస్తవం. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న నా కొడుకుని కూడా బెదిరిస్తున్నారు. దయచేసి మాలాంటి దళితులకు న్యాయం జరిగేలా చూడండి’ అని పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నది భాగ్యవతి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
jai bhim | చినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ ఎవరు? ఆమెకు ఎలా అవకాశం వచ్చింది?
Lawrence: జై భీమ్ చూసి చలించిపోయిన లారెన్స్.. ఇల్లు కట్టిస్తానని హామీ
Jai Bhim | కట్ చెప్పినా కన్నీళ్లు ఆగేవి కాదు.. చినతల్లి పాత్రపై లిజోమోల్ ఎమోషన్
Suriya: రియల్ సినతల్లికి రూ. 15లక్షల చెక్ అందించిన సూర్య