తమిళ స్టార్ హీరో సూర్య ఈ మధ్య రియల్ స్టోరీస్పై సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం జై భీమ్. టిజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. గిరిజనులపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఈ సినిమా తెరకెక్కించగా, ఇందులో అందరి మనసులను కదిలించింది ‘సినతల్లి’ పాత్ర. ఆమె అసలు పేరు పార్వతి. ఇప్పటికీ ఆమె సరైన ఇల్లు లేకుండా చిన్న గుడిసెలో నివసిస్తోంది.
పోలీసు కస్టడీలో చంపబడిన తన భర్త రాజకన్నుకు న్యాయం చేయమని భార్య పార్వతి అమ్మాళ్ చేసిన న్యాయపోరాటం చేసింవది. పార్వతమ్మ, రాజకన్ను అనే వ్యక్తుల జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా ఫ్యాన్స్ నే కాదు.. సెలబ్రెటీలు సైతం ఆకట్టుకున్నది. ఈ సినిమాని చూసిన పార్వతి ఫ్యామిలీకి అండగా నిలబడతానని దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ చెప్పారు. రియల్ సినతల్లి అయిన పార్వతమ్మకు సొంతిల్లు కట్టిస్తానని ప్రకటించారు.
నటుడు సూర్య మంగళవారం చెన్నైలో రాజకన్ను భార్య పార్వతిని స్వయంగా కలిసి రూ.15 లక్షల చెక్కును అందజేశారు. తన తరపున రూ.10 లక్షలు, తన చిత్ర నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్ తరపున రూ.5 లక్షలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.ఎస్. బాలకృష్ణన్, రాజకీయ నాయకత్వ కమిటీ సభ్యుడు జి. రామకృష్ణన్ తదితరులు పాల్గొని నటుడు సూర్యకు కృతజ్ఞతలు తెలిపారు.