ఒక్క అవకాశం ఆ స్త్రీమూర్తులను సిరి మహాలక్షులుగా మార్చింది. చిరుధాన్యాల ఉత్పత్తులతో అచిరకాలంలోనే ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. రామగిరి ఖిల్లా అడ్డాగా.. స్త్రీ శక్తిని చాటుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగారం గ్రామం ‘వనితా జ్యోతి గ్రామైక్య సమాఖ్య’ విజయం అందరికీ ఆదర్శం.
పెద్దపల్లి జిల్లా నాగారం గ్రామం అతివలు ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. చిరుధాన్యాలతో బిస్కెట్లు, కేకులు, రాగి మాల్ట్ తదితర ఉత్పత్తులు చేస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. రామగిరి ఖిల్లాలో 2010 నుంచి కృషి విజ్ఞాన కేంద్రం పనిచేస్తున్నది. ఈ కేంద్రం ఆధ్వర్యంలో నాగారంలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చిరుధాన్యాలతో పలురకాల ఉత్పత్తులు తయారు చేసేలా అక్కడి మహిళలను ప్రోత్సహించారు. గ్రామంలోని వనితా జ్యోతి గ్రామైక్య సమాఖ్యకు చెందిన 18 మంది సభ్యులకు పదిరోజులపాటు శిక్షణ అందించారు. తర్వాత రూ.1.50 లక్షలతో ఉత్పత్తుల తయారీకి అవసరమైన సామగ్రిని, యంత్రాలను అందజేశారు.
కృషి విజ్ఞాన కేంద్రం అండతో చిరుధాన్యాల ఉత్పత్తులు తయారుచేయడం మొదలుపెట్టారు నాగారం వనితలు. గతనెల నుంచి ‘సిరి ఫుడ్ ప్రొడక్ట్స్’ పేరుతో వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్లు తయారుచేస్తున్న మిల్లెట్ బిస్కెట్లు, కేకులు, దిల్పసంద్ బ్రెడ్, రాగి మాల్ట్, మల్టీ గ్రెయిన్ పిండిని పెద్దపల్లి, మంథని, గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్లు, వేములవాడ, కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రాల్లో స్టాళ్లను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. సింగరేణి, రామగుండం, ఎన్టీపీసీ ప్రాంతాల్లో వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు.
‘మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చిరుధాన్యాలతో రుచికరమైన ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్నాం’ అంటారు వనితా జ్యోతి గ్రామైక్య సమాఖ్య అధ్యక్షురాలు బూడిద రజిత. ‘మా సమాఖ్యలో 18 మంది సభ్యులం ఉన్నాం. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందుతున్నాం. రోజూ 40 కిలోల బిస్కెట్లు ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తున్నాం. జొన్నలు, సజ్జలు, కొర్రలు, సోయా లాంటి చిరుధాన్యాలతో రకరకాల ఉత్పత్తులు తయారుచేస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు సమాఖ్య అధ్యక్షురాలు రజిత. ఈ మహిళల చైతన్యాన్ని స్వయంగా చూసిన కలెక్టర్ సంగీత సత్యనారాయణ బేకరీ ఉత్పత్తులను మరింత రుచికరంగా, ఆకర్షణీయంగా తయారు చేసేందుకు రూ.80 వేలు సాయం అందించారు. ఈ మొత్తంతో ముడి సరుకులను కొనుగోలు చేసి, ఉత్పత్తి పెంచారు. తమపై నమ్మకం ఉంచి, ప్రోత్సహించిన కృషి విజ్ఞాన కేంద్రం నిర్వాహకులకు, అధికారులకు రుణపడి ఉంటామని అంటున్నారు ‘వనితా జ్యోతి’ సభ్యులు. తమ విజయం మరింత మంది మహిళలకు స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
…? అంకరి ప్రకాశ్
“Kanika Reddy | విమానయాన సంస్థకే సీఈవో అయిన ఈమె ఎంతోమంది మహిళలకు ఇన్స్పిరేషన్”
“Manasa Varanasi | ప్రపంచ సుందరి కాలేకపోయినా.. మనసు మాత్రం బంగారం”
“9999 మేకులపై 9 నిమిషాలు నాట్యం చేసిన లిఖిత.. ఎలా సాధ్యమైందంటే..”
Akanksha Sharma | ఐకియాలో ఉన్న ఒకే ఒక్క భారతీయ డిజైనర్ ఈమెనే.. తన గురించి ఈ విషయాలు తెలుసా”
“Rajyalaxmi | పీహెచ్డీ చేసిన తొలి సంచార జాతి మహిళ ఈమెనే..”