Nostalgia | ‘గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని నానుడి. అంటే, మానవీయ సంబంధాలు, వాతావరణం, ఆహార పదార్థాల విషయాల్లో గతమే బాగుండేదని గొప్పగా చెప్పడానికి పెద్దలు ఈ మాటను ప్రయోగించేవారు. కథలకు కరువొచ్చిందో, వర్తమాన అంశాలపై పట్టు చిక్కడం లేదో తెలియదు కానీ, సినీజనం సైతం ఇదే సూత్రాన్ని వంటబట్టించుకున్నారు. వర్తమానాన్ని కాదని గతం లోతుల్లోకి వెళ్లి కథలను వెలికి తీస్తున్నారు. గతమెంతో ఘనమంటూ ప్రేక్షకులను థియేటర్ల వరకూ రప్పించడంలో సఫలం అవుతున్నారు. అయితే, సగటు ప్రేక్షకుడు మాత్రం అన్ని సినిమాలనూ ఒకేలా స్వీకరించడం లేదు. తవ్వకాల్లోంచి తీసిన కథయినా.. తనకు నచ్చితేనే హిట్ టాక్ ఇస్తున్నాడు.
అనగనగా.. దాదాపు అన్ని కథలు ఇలాగే మొదలవుతాయి. ఇప్పుడు సినిమా కథలు కూడా ఇలాగే ప్రారంభమవుతున్నాయి. ఈ అనగనగాలు అన్నీ 80, 90ల మధ్యే కొట్టుమిట్టాడుతున్నాయి. ‘ఆదిత్య 369’ సినిమాలో దర్శకుడు సింగీతం భూతకాలంలోకి తీసుకుపోయాడంటే.. కథ డిమాండ్ చేసింది కాబట్టి. మరి అదే చిత్రంలో ఆయనే సుదూర భవిష్యత్తునూ దర్శింపజేశాడు. కానీ, ప్రస్తుత దర్శకులకు ఏమైందో తెలియదు కానీ, ‘న భూతో.. నో భవిష్యత్తు’ అని భావిస్తున్నారు. గతంలోకి తొంగి చూడకుండా చిత్రాలను తెరకెక్కించడం లేదు. పైగా సినిమా గురించి ప్రస్తావించినప్పుడల్లా ఎనభై, తొంభైల నేపథ్యం అంటూ ప్రేక్షకులను నోస్టాలజీ భ్రమల్లోకి నెట్టి నెట్టుకొస్తున్నారు. బయోపిక్లు, చారిత్రక, జానపద కథలను నిర్మించే క్రమంలో గతంలోకి వెళ్లక తప్పదు. పక్కా కమర్షియల్ సినిమాల్లోనూ ఇదే పంథాను అనుసరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. వర్తమాన అంశాలపై కథలు సిద్ధం చేసుకోలేకపోతున్నారో, ఈ తరం జోరుకు తగ్గట్టుగా సీన్లు పండించలేం అనుకుంటున్నారో తెలియదు కానీ, గతమే ఘనం అని ఫిక్సవుతున్నారు. ఇటీవల విడుదలైన తెలుగు సినిమాల్లో చాలా కథలు గతం నేపథ్యం కలిగినవే!
రామ్చరణ్ కెరీర్లో భారీహిట్ చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కాలం 1980 ప్రాంతంలోనిదే. కథావస్తువు పరువు హత్యే అయినా, మూలకథలో గ్రామ రాజకీయాలు, కులవివక్ష అంశాలను స్పృశిస్తూ సాగే కథను మరింత లోతుగా చూపించడానికి గతాన్ని వాడుకున్నాడు దర్శకుడు. ఆ గట్టునున్న ప్రెసిడెంట్ పెత్తనాలు, ఈ మట్టినున్న సాధారణ ప్రజల ఈతిబాధలను స్పష్టంగా చెప్పగలిగాడు. దీనికితోడు జానపద బాణీలకు దగ్గరగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమా విజయానికి దోహదం చేసింది. చంద్రబోస్ పాటలు కూడా జనాదరణ పొందాయి. మొత్తానికి సుకుమార్ మార్క్ టేకింగ్ రంగస్థలం సినిమాను భవిష్యత్తులోనూ గుర్తుంచుకునే విధంగా నిలబెట్టింది.
కరోనా కారణంగా థియేటర్లలోకి రాలేదు కానీ, నారప్ప హిట్ సినిమాల జాబితాలో చేరిపోయింది. తమిళంలో ధనుష్ హీరోగా వచ్చిన ‘అసురన్’ ఈ చిత్రానికి మాతృక. వెంకటేశ్ హీరోగా నటించిన నారప్ప సినిమా నేపథ్యం కూడా గతమే! ముప్పయ్, నలభై ఏండ్ల కిందటి పరిస్థితుల ఆధారంగా దీన్ని నిర్మించారు. దళితులపై గ్రామపెద్దలు సాగించిన దమనకాండను హృద్యంగా తెరకెక్కించారు. ‘ఆస్తిపాస్తులుంటే లాక్కుంటారు.. చదువును ఎవరూ దోచుకోలేరు’ అనే సత్యాన్ని చాటిచెప్పిన నారప్ప ఓటీటీలో ప్రభంజనమే సృష్టించింది. కథకు మరింత బలం చేకూరుతుందనే ఉద్దేశంతోనే కథాకాలాన్ని వెనక్కి తీసుకెళ్లారేమో అనిపిస్తుంది.
పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ‘పుష్ప’ కథా కాలం 1990 ప్రాంతంలోనిదే. ఎర్ర చందనం మాఫియా నేపథ్యంలో సాగిన ఈ సినిమా బాక్సాఫీస్ను కొల్లగొట్టింది. కథాకథనాలు పండటం, పాటలు కూడా పసందుగా ఉండటంతో ‘పుష్ప’ చిత్రం టాలీవుడ్ ఫైర్ అనిపించుకుంది. హిందీలోనూ రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. సినిమాలో కథానాయకుడు ఓమ్నీ వ్యాన్లో షికార్లు కొట్టడం, పేజర్ వాడటం ఇవన్నీ నోస్టాలజీ లుక్ కోసం చేసిన ప్రయత్నాలే! గతకాలంలో కథాకమామిషు నడిపించడం అనుకున్నంత తేలికేం కాదు. పాత్రల తీరుతెన్నులు, ధరించే దుస్తుల మొదలు పలికే మాటల వరకు ఆ కాలానికి తగ్గట్టుగా చూపించగలిగాడు దర్శకుడు సుకుమార్. అయితే, ‘పుష్ప’ రెండో భాగం అయినా వర్తమానంలో నడుస్తుందో, గతంలోనే ఉండిపోతుందో సమీప భవిష్యత్తులో తేలనుంది!
బయోపిక్లు నిర్మించే క్రమంలో ఎన్నేండ్లయినా వెనక్కి వెళ్లొచ్చు. జానపద చిత్రాలకు వచ్చేసరికి శతాబ్దాల కిందట అని మొదలుపెట్టినా ఏ చిక్కూ లేదు. ‘బాహుబలి’ లాంటి ఏ కాలం నాటిదో తెలియకపోయినా ఏ చిక్కూ లేదు. పాన్ ఇండియాగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ ఫిక్షన్తో కూడుకున్న చారిత్రక చిత్రంగా నిలిచింది. ‘రెండు చారిత్రాత్మక పాత్రలు కలిసి ఉంటే..?’ అనే ప్రశ్నే ఈ కథకు మూలమని దర్శకుడు రాజమౌళి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కథా వస్తువును కూడా వందేండ్ల నాటిదిగా ఊహించుకొని ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాడు రాజమౌళి. రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్ను కథానాయకులుగా ఎంచుకోవడంతోనే సగం సక్సెస్ సాధించాడు. దీనికితోడు కథాకథనాలూ పండటంతో ‘ట్రిపుల్ ఆర్’ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించింది.
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’ ఇతివృత్తం కూడా గతంలో జరిగినదే! ధర్మస్థలి ఒకవైపు, నక్సల్స్ నేపథ్యం మరోవైపు ఈ సినిమాకు మూలస్తంభాలుగా నిలిచాయి. అయితే, ముప్పయ్ ఏండ్లు వెనక్కి వెళ్లిన దర్శకుడు… కార్పొరేట్ వ్యవహారాన్ని కథలో దూర్చడంతో అతికినట్టు కనిపించలేదు. తండ్రీకొడుకులు చిరంజీవి, రామ్చరణ్ జతకట్టడంతో సినిమాపై ఏర్పడిన భారీ అంచనాలను అందుకోలేకపోవడం కూడా సినిమా వైఫల్యానికి కారణమైంది.
ఇలా చెబుతూపోతే ఈ మధ్య వచ్చిన చాలా చిత్రాలు‘గతం’లో తయారైనవే. కొన్ని జరిగిన కథలు కాగా, కొన్ని ఊహించుకున్నవి. కార్తి హీరోగా నటించిన ‘ఖాకీ’ సినిమా నేపథ్యం పాతికేండ్ల నాటిది. ఇటీవల విడుదలైన ‘విరాటపర్వం’ కూడా గతంలో జరిగిన వాస్తవ కథను కాస్త సినిమాటిక్గా తెరకెక్కించిందే. భారతీయ సినిమా రికార్డులను తిరగరాసిన ‘కేజీఎఫ్’ నేపథ్యమూ గతమే! సూర్య హీరోగా నటించిన ‘జై భీమ్’, వరుణ్తేజ్ ‘కంచె’, రానా ‘ఘాజీ’ ఇలా ఎన్నో సినిమాలు గతకాలాన్ని నమ్ముకొని సొమ్ము చేసుకున్నవే! కొన్నేండ్ల కిందట మొదలైన ఈ ట్రెండ్ మరింత కాలం కొనసాగుతుందో, భవిష్యత్లో పంథా మార్చుకుంటుందో వేచి చూడాల్సిందే!!
అభిమానే దర్శకుడైతే.. ఫ్లాపుల్లో ఉన్న హీరో కూడా టాప్ అవ్వాల్సిందే !!