Lokesh Kanagaraj | ‘విక్రమ్.. విక్రమ్.. విక్రమ్..’ తమిళనాట మారుమోగుతున్న టైటిల్. ఇక లోకనాయకుడి అభిమానులైతే ఆ సినిమా నామమే జపిస్తున్నారు. కారణం, పుష్కర కాలానికి కమల్హాసన్కు ఓ హిట్టు పడింది. అదికూడా మామూలు హిట్టు కాదు.. దేశం మొత్తం పటాస్లా పేలిపోయిన హిట్టు. ఆ వేలమంది, లక్షలమంది అభిమానుల్లో.. సాక్షాత్తు ఆ సినిమా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కూడా ఉన్నాడు.
లోకేశ్ కనగరాజ్.. 36 ఏండ్ల వయసులోనే.. అనితర సాధ్యమైన విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ గెలుపు రాత్రికి రాత్రే వరించింది కాదు. అదృష్టం కొద్దీ తారసపడింది అంతకన్నా కాదు. ఏన్నో నిద్రలేని రాత్రుల ఫలితమిది. తినో తినకో.. రేయింబవళ్లు స్క్రిప్ట్పైనే వర్క్ చేస్తూ.. తన ఆరాధ్య దైవానికి ఆ అభిమాని అందించిన విజయ నైవేద్యం.. ‘విక్రమ్’. తమిళ సినీ
చరిత్రలో ఓ వెలుగు వెలిగిన కమల్హాసన్కు సెకండ్ ఇన్నింగ్స్లో చెప్పు కోదగ్గ ఒక్క హిట్టూ లేదు. ‘కమల్ పని అయి పోయింది’, ‘చేస్తే రాజకీయం చెయ్యాలి.. లేకపోతే సినిమాలు చెయ్యాలి’ అంటూ పరిశ్రమ, ప్రజలు పెదవి విరుస్తున్న సమయంలో ‘విక్రమ్’తో తన అభిమాన హీరోను సగర్వంగా నిలబెట్టాడు దర్శకుడు లోకేశ్ కనగరాజ్. విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లను వసూలుచేసింది విక్రమ్. చేసింది నాలుగు సినిమాలే అయినా.. లోకేశ్ ‘స్టార్ డైరెక్టర్’ అనిపించుకున్నాడు.
‘నాకు అపజయ భయంఎక్కువ. అదే నన్ను వెంటాడుతూ ఉంటుంది. ఒక సినిమా ఫెయిల్ అయితే.. నేనే కాదు.. నాతో పనిచేసిన టెక్నీషియన్స్, నా టీమ్, నన్ను నమ్ముకున్న హీరో
అభిమానులు.. అన్నిటికీ మించి రూ.200 పెట్టి టికెట్ కొనే సగటు ప్రేక్షకుడు కూడా ఫెయిల్ అయినట్లే. అందుకే ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేస్తాను’ అంటున్నాడు లోకేశ్. ప్రేక్షకులతో విజిల్స్ కొట్టించడం, మాస్ ఎలిమెంట్స్తో రోమాలు నిక్కబొడుచుకునేలా కథ చెప్పడం, అనూహ్యమైన స్క్రీన్ప్లేతో విమర్శకులను సైతం మెప్పించడం.. లోకేశ్కు కొట్టినపిండి.
లోకేశ్ కనగరాజ్కు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే పిచ్చి. 1986లో విడుదలైన కమల్హాసన్ ‘విక్రమ్’ అంటే మరీ ఇష్టం. పదేండ్లు వచ్చేనాటికి ఏ వందసార్లో వీసీఆర్లో చూసుంటాడు. తను పుట్టిన ఏడాదిలోనే ఆ సినిమా కూడా విడుదలైంది. తనకు ‘విక్రమ్’ అనే పేరు ఎందుకు పెట్టలేదని తల్లిదండ్రులతో గొడవపడేవాడు. క్రమంగా హాలీవుడ్ సినిమాలపై కూడా మక్కువ పెంచుకున్నాడు. ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ తర్వాత, ఎంబీఏ చేశాడు. అనంతరం కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో నాలుగేండ్లు ఉద్యోగం చేశాడు. అప్పుడే, తన చిన్ననాటి ఆశ మళ్లీ జీవం పోసుకుంది. ఉద్యోగం వదిలేసి షార్ట్ఫిల్మ్స్పై దృష్టి పెట్టాడు. 2012లో ‘అచమ్ థావిర్’ అనే షార్ట్ఫిల్మ్ రూపొందించాడు. అది ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు అవార్డులు గెలుచుకుంది. తర్వాత ‘కస్టమర్ డిలైట్’ అనే వీడియో రూపొందించాడు. తర్వాత కార్తిక్ సుబ్బరాజ్ మార్గనిర్దేశంలో ‘అవియల్’కు పనిచేశాడు. ‘కాలం’ పేరుతో తీసిన ఓ షార్ట్ఫిల్మ్ నాలుగు అవార్డులు గెలుచుకుంది. అలా అతని ప్రతిభ చూసిన సుబ్బరాజ్ సినిమాల్లోకి రావాలని ప్రోత్సహించాడు.
లోకేశ్ స్క్రిప్ట్ ప్రతిభకు మెచ్చిన ఎస్.ఆర్ సంస్థ 2017లో సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని తొలి చిత్రం ‘మానగరం’తోనే తమిళ ఇండస్ట్రీకి నేనొస్తున్నానంటూ హింట్ ఇచ్చాడు. ఆ తర్వాత కార్తి హీరోగా ‘ఖైదీ’ రూపొందించాడు. తన స్క్రీన్ప్లేతో ప్రేక్షకులను రెండున్నర గంటలపాటు కట్టిపడేశాడు లోకేశ్. మానగరం, ఖైదీ వేరువేరు జోనర్లు అయినా.. తనదైన విభిన్న శైలితో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ వెంటనే హీరో విజయ్, విజయ్ సేతుపతిని ఒకే ఫ్రేమ్లో పెట్టి ‘మాస్టర్’ తీశాడు. ఇది పాన్ ఇండియా సూపర్హిట్. మళ్లీ ఇప్పుడు విక్రమ్. లోకేశ్ ఏ ఫిల్మ్ స్కూల్లోనూ శిక్షణ తీసుకోలేదు.. ఏ దర్శకుడి దగ్గరా అసిస్టెంట్గా చెయ్యలేదు. కేవలం కమల్హాసన్ సినిమాలు చూసే డైరెక్షన్ నేర్చుకున్నాడు.
తమిళ పరిశ్రమలో లోకేశ్పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇన్నాళ్లూ యాక్షన్ థ్రిల్లర్లతో ప్రేక్షకులను మెప్పించిన లోకేశ్.. తనదైన శైలిలో స్క్రిప్ట్కు తగ్గట్లుగా కామెడీ, ఫాంటసీలనూ తెరపై సరికొత్తగా చూపించాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే విజయ్తో ఓ కొత్త సినిమాకు సంతకం చేశాడు. కార్తితో.. ఖైదీ సీక్వెల్ సిద్ధంగా ఉంది. డిల్లీ(కార్తి)ని ఎవ్వరూ ఊహించని స్థాయిలో చూపుతాడని కోలీవుడ్లో ఊహలు మొదలయ్యాయి. కారణం, తను దర్శకత్వం వహించిన నాలుగు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడమే. తెలుగులో కూడా రేపోమాపో ప్రభాస్, రామ్చరణ్, మహేశ్బాబుతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు లోకేశ్.
Vikram All time Records | కమల్హాసనా మజాకా..విక్రమ్ మల్టీపుల్ ఆల్టైమ్ రికార్డ్స్..!”