Kattula lakshmi | ఉద్యమ ఆవేశం అడవులకు తీసుకెళ్లింది. తుపాకి పట్టించింది. అనుకోని పరిస్థితులు జనజీవనంలోకి తీసుకొచ్చాయి. ఒకనాటి ఆవేశం బాధ్యతగా మారింది. ఆయుధం పట్టిన చేతులిప్పుడు అన్నం పెడుతున్నాయి. ఉద్యమాల అక్కను, అనాథలకు అమ్మను చేశాయి. జీవితానుభవాల కత్తుల గాట్లే.. కత్తుల లక్ష్మిని సామాజిక సేవ వైపు నడిపించాయి.
సమాజంలో మార్పు కోసం తుపాకి పట్టిన ఆ చేతులు, ఇప్పుడు అభాగ్యులకు అన్నం పెడుతున్నాయి. ఆమాటకొస్తే, కత్తుల లక్ష్మి జీవితమంతా సమాజం చుట్టూనే తిరుగుతున్నది. ఆమెకు ఆకలి బాధ తెలుసు, అన్నం పెట్టడంలోని ఆనందమూ తెలుసు. కాబట్టే, ఏ ఆధారమూ లేని అభాగ్యులకు తల్లి ప్రేమను పంచుతున్నది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రామన్నగూడెం గ్రామం లక్ష్మి సొంతూరు. కన్నవారు ఆకిటి నర్సిరెడ్డి-అనసూయ. ఇద్దరూ పీపుల్స్వార్ సానుభూతిపరులే. పార్టీ కోసం పనిచేసేవారు. దీంతో బడి వయసులోనే కత్తుల లక్ష్మిపై పోలీసులు నిఘా పెట్టారు. కన్నవారి ఆచూకి చెప్పమంటూ ఒత్తిడి పెంచారు. ఆ వేధింపులు తట్టుకోలేక, ఏడో తరగతిలోనే చదువు ఆపేసి విప్లవోద్యమం వైపు అడుగులు వేసింది. పోరుబాటలో ఉండగానే, దళ కమాండర్ కత్తుల రవీందర్ను పెండ్లి చేసుకుంది. కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఈ దంపతులను మహారాష్ట్రకు పంపింది పార్టీ నాయకత్వం. ఓసారి వైద్యం కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. జైలు శిక్ష పూర్తయ్యాక అజ్ఞాతంలోకి వెళ్లినా, అనారోగ్య సమస్యల వల్ల పోలీసుల ఎదుట లొంగిపోక తప్పలేదు. తర్వాత, ఆ ఆలూమగలు ఉద్యమ పంథాను వీడి సాధారణ జీవితాన్ని ఎంచుకున్నారు.
కట్టుబట్టలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన లక్ష్మి, రవీందర్ దంపతులకు అడుగడుగునా అవరోధాలే. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అనేక కష్టాలు పడ్డారు. ఆ ఇబ్బందులను అధిగమించలేక ఒకదశలో లక్ష్మి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుంది. మరణాన్ని వెతుక్కుంటూ కాజీపేట రైల్వేస్టేషన్ వైపు వెళ్లింది. పట్టాలపై ప్రాణాలు వదలాలన్నది ఆలోచన. అక్కడ, ఏ దిక్కూలేని పిల్లలు కనిపించారు. పిడికెడు మెతుకుల కోసం ఆ బిడ్డలు భిక్షమెత్తుకుంటున్న దృశ్యం లక్ష్మి మాతృ హృదయాన్ని కదిలించింది. అంతే, చావు ఆలోచన పక్కనపెట్టింది. తాను బతికి, నలుగురినీ బతికించాలని తీర్మానించుకుంది. చీరల వ్యాపారం ప్రారంభించింది. క్రమంగా ఆ రంగంలో నిలదొక్కుకుంది. సామాజిక కార్యక్రమాలు చేపట్టడానికి సరిపడా నిధులు సమకూరాయి. దీంతో ఆ దంపతులు ‘వర్ధన్ అనాథ ఆశ్రమం’ పేరిట ఓ సేవా వేదికను ఏర్పాటు చేసుకున్నారు.
ఏజెన్సీ ఏరియాలో ప్రమాదవశాత్తు ఇండ్లు కాలిపోయినవారికి బియ్యం, బట్టలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నిరుపేద మహిళలకు చీరలు పంచారు. అనాథల కోసం అన్నదానం చేపట్టారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు అందించారు. 2017లో జనగామ జిల్లా కేంద్రంలో రెడ్డి సంక్షేమ భవనాన్ని అద్దెకు తీసుకొని రోజూ రెండు పూటలా అన్నం పెడుతూ ఎంతోమంది అభాగ్యుల కడుపు నింపుతున్నారు. తల్లిదండ్రులు లేని 30 మంది ఆడ పిల్లలను చేరదీసి ఆలనాపాలన చూస్తున్నారు. ఉచిత భోజనం, వసతి అందిస్తున్నారు. విద్యాబుద్ధులు చెప్పిస్తున్నారు. మొత్తంగా జీవితాలను తీర్చిదిద్దుతున్నారు. పుట్టినరోజు, పెండ్ల్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాలను చాలామంది వర్ధన్ ఆశ్రమంలోని అనాథ బాలల మధ్యనే జరుపుకొంటారు. నిరాదరణకు గురైన ఎంతోమంది వృద్ధులకు ఈ దంపతులు ఆశ్రయం కల్పిస్తున్నారు. అనాథ శవాలకు దగ్గరుండి కర్మకాండలు నిర్వహిస్తున్నారు. కొద్దినెలల క్రితం చుక్కల సత్యం అనే దాత తన కుమార్తె స్నేహ జ్ఞాపకార్థం యాదగిరిగుట్ట పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద సుమారు రూ.కోటి విలువైన 20 గుంటల స్థలాన్ని ఆశ్రమానికి దానంగా ఇచ్చారు. భవన నిర్మాణానికి భూమి పూజ కూడా జరిగింది.
‘పోరుబాట వదిలి జనజీవనంలోకి వచ్చే సమయానికి ఉండటానికి ఇల్లు లేదు. తినడానికి బుక్కెడు బువ్వ దొరకలేదు. ఎవరూ ఆదరించలేదు. ఎలా బతకాలో తెలియని పరిస్థితి. ఆ సమయంలో మాకంటే దీన స్థితిలో ఉన్న పిల్లల బతుకులు కదిలించాయి. సేవ వైపు నడిపించాయి. అనాథలకు బంగారు భవిష్యత్ ఇవ్వాలని సంకల్పించాం. దయార్ద్ర హృదయులు ముందుకు వస్తే పక్కా భవనాన్ని నిర్మిస్తాం. ఇంకెంతోమందికి అన్నం పెడుతాం’ అంటున్నారు లక్ష్మి.
✍ఎన్.ఆర్.అనిల్ కుమార్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వైకల్యం వారి ప్రతిభకు అడ్డం కాలేదు.. మోడలింగ్లో దూసుకెళ్తున్న కేరళ యువతులు
పిల్లలను ఎప్పుడు స్కూల్కు పంపించాలి.. విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ స్వీయ అనుభవం ఏంటంటే..
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
Ira singhal | దివ్యాంగురాలైనా ఆమె ఎంతోమందికి ఇన్స్పిరేషన్.. ఐఏఎస్ సాధించడమే కాదు..