Pakistan : పీవోకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్)లో ఆందోళనలు చేస్తున్న ఉద్యమకారుల్ని కాల్చి చంపడాన్ని పాక్ ప్రభుత్వం సమర్ధించుకుంది. ఆందోళనకారులు ఇండియాలాగే తమ దేశానికి శతృవులు వంటి వారని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్ వ్యాఖ్యానించాడు. పీవోకేలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 5 నుంచి ఈ ఆందోళనలు సాగుతున్నాయి. పాక్ ప్రభుత్వం నుంచి విముక్తి, స్వతంత్రం కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేదా తమ ఇతర డిమాండ్లు అయినా అంగీకరించాలని కోరుతున్నారు.
ఈ ఆందోళనలు సోమవారం, మంగళవారం తీవ్రస్థాయికి చేరాయి. రావల్కోట్లో వేలాది మంది ఆందోళన చేస్తుండగా.. పాక్ భద్రతా బలగాలు వారిపై దారుణ చర్యకు దిగాయి. ఆందోళనకారులపై జరిపిన కాల్పుల్లో రెండు రోజుల్లోనే 25 మంది వరకు మరణించినట్లు సమాచారం. ఇటీవలి ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి 80 మందికిపైగా పీవోకే ప్రజలు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. మంగళవారం కూడా పాక్ పోలీసులు దాడులు జరిపారు. మీర్పూర్లో జరిపిన కాల్పుల్లో దాదాపు 20 మంది ఉద్యమకారులు మరణించినట్లు సమాచారం. ఈ అంశంపై పాక్ మంత్రి ఖవాజా అసిఫ్ స్పందించాడు. ఈ ఆందోళనకారులు పాకిస్తాన్కు ఇండియాలాగే శతృవులు అంటూ వ్యాఖ్యానించాడు. పాక్ చర్యను అక్కడి ఆందోళనకారులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు.
తమ ప్రాథమిక హక్కుల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం తమపై హింసకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు. అయినప్పటికీ జాతీయ, అంతర్జాతీయ మీడియా మౌనంగా ఉండటాన్ని వారు తప్పుబడుతున్నారు. తమ వీధులన్నీ ఆందోళనకారుల మృతదేహాలతో నిండిపోయాయని ఆవేదనగా చెబుతున్నారు. గాయపడ్డవారిని తోటివారు తమ భుజాలపై మోసుకెళ్తున్న దృశ్యాలు కలవరపెడుతున్నాయి. పీవోకేలో ప్రజల్ని కాల్చి చంపడంపై భారత్ కూడా ఘాటుగా స్పందించింది. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ప్రజల్ని కాల్చి చంపడాన్ని ఇండియా తీవ్రంగా ఖండించింది. అమాయక ప్రజలపై క్రూరత్వానికి పాల్పడటాన్ని తప్పుబట్టింది.