Summer Food | ఎండాకాలం వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఐస్క్రీములు, శీతలపానీయాలను ఆశ్రయిస్తాం. అందులో కెలోరీలు అధికం. కాబట్టి, వాటిని దూరంగా ఉంచి.. మనకు తగినన్ని పోషకాలను అందిస్తూనే శరీరాన్ని చల్లగా ఉంచే పండ్లు, కూరగాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం.
ఎండాకాలం చెమట రూపంలో నీరు ఎక్కువగా శరీరం బయటికి వెళ్లిపోతుంది. శరీర శ్రమ, వ్యాయామం చేసేవాళ్లలో ఇది మరింత ఎక్కువ. అందువల్ల అన్నివేళలా నీళ్ల సీసా దగ్గర ఉంచుకోవాలి. నీళ్లు శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. అలా శరీరానికి చల్లదనం సమకూరుతుంది. అదనంగా ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం ఆరోగ్యకరం. రోజురోజుకూ ఎండవేడి పెరుగుతున్న క్రమంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన, తీసుకోకూడని ఆహార పదార్థాలేవో తెలుసుకుందాం.
భోజనం, చిరుతిండ్లు… ఆహారం ఏదైనాసరే ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. కొవ్వులను కరిగించడంతోపాటు కండరాలకు ఆహారం ఇవ్వడం కూడా ముఖ్యమే. తియ్యగా రసాలూరే
స్ట్రాబెర్రీలు ఫ్లేవనాయిడ్లకు చిరునామా. ఫ్లేవనాయిడ్లు వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే బలీయ శక్తులు. అంతేకాదు, చర్మానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. దాంతో చర్మ స్వరూపం, నిర్మాణం, రంగు మెరుగుపడతాయి. ఇక పుచ్చకాయ చర్మాన్ని సంరక్షించే లైకోపీన్తోపాటు 92 శాతం నీటిని కలిగి ఉంటుంది.
చెమట రూపంలో బయటికి వెళ్లిన ద్రవాలను భర్తీ చేసుకోవడానికి నిమ్మరసం, కొబ్బరినీళ్లు, పలుచటి మజ్జిగ తాగాలి. తీపి అంటే నోరు కట్టేసుకోలేని వారికి మామిడిపండ్లు మంచి మార్గంగా నిలుస్తాయి. అలా మిఠాయిల మీదికి మనసు మళ్లకుండా కట్టడి చేసుకోవచ్చు. మామిడి పండ్లలో ఫైబర్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్ పుష్కలం. ఐరన్ లోపం ఉన్న మహిళలకు మామిడి పండ్లు మంచి ఫలహారం.
వేసవిలో రంగురంగుల కూరగాయలు, పండ్లను భోజనంలో భాగం చేసుకోవాలి. ఈ రూపంలో శరీరానికి పోషకాల అండ అందించాలి. నీటిశాతం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే మెదడు చురుగ్గా ఉంటుంది. మనసు బాగుంటుంది. ఎండవేడిని తట్టుకునే ప్రయత్నంలో చెమట శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అయితే, నీళ్లంటే కేవలం తాగడమే కాదు, తినాల్సి ఉంటుంది కూడా! నీటి శాతం అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల తక్కువ కెలోరీలతోనే భోజనం ముగిస్తామని అధ్యయనాలలో వెల్లడైంది.
యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సహా విటమిన్-సి, వృక్ష రసాయనాలతో సమృద్ధమైన అంగూర్ పండ్లు టైప్-2 మధుమేహం నుంచి కాపాడతాయి. పైగా వీటిలో సహజమైన తీపితోపాటు నీటి శాతం ఎక్కువ. అధిక నీటిశాతం ఉండే కర్బూజ ఫలాలు.. అధిక కెలోరీలు, అధిక కొవ్వును కలిగిన ఐస్క్రీంలకు ఎండాకాలంలో మంచి
ప్రత్యామ్నాయం.
కెఫిన్, ఆల్కహాల్ ఉన్న పానీయాలు, కార్బొనేటెడ్ డ్రింక్స్, చక్కెర నీళ్లను దూరం పెట్టాలి. బాగా చల్లని ద్రవ పదార్థాలు, పండ్ల రసాలను తాగకూడదు. అప్పటికప్పుడు ఆ రుచి బాగానే అనిపించినా, ఎండాకాలంలో మన శరీరం చల్లబడటానికి అంతగా దోహదపడవు. ఒంట్లో వేడిగా అనిపించినప్పుడు చల్లటి పానీయాలను తాగడం వల్ల, చర్మంలో రక్తనాళాలు కొంచెం నొక్కుకుపోతాయి. అలా వేడి నష్టాన్ని తగ్గించి, కాసేపు ఉపశమనం ఇస్తాయి. కానీ శరీరం చల్లబడటానికి ఇదంత మంచి మార్గం మాత్రం కాదు.
చక్కెర, తేనె లాంటి తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటి స్థానంలో పండ్లు, కూరగాయల నుంచి అందే సహజమైన చక్కెర మంచిది. మసాలాలు, ఉప్పు ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలను తగ్గించుకోవాలి. పండ్లు, కూరగాయల్లో సహజంగా ఉండే ఉప్పును గ్రహించడం వల్ల శరీరంలో లవణాల శాతం సమతుల్యంగా ఉంటుంది. అదే సముద్ర ఉప్పు అయితే.. శరీరం నుంచి బయటికి పంపాల్సి ఉంటుంది. దీనికోసం నీళ్లు ఎక్కువగా తాగాల్సి వస్తుంది. వడలు, సమోసాలు, చిప్స్, బజ్జీలు వగైరా వేయించిన ఆహార పదార్థాలకు కోత విధించాలి. ఎందుకంటే, వీటిలోని కొవ్వు ఉష్ణాన్ని కలిగిస్తుంది.
– మయూరి ఆవుల, న్యూట్రిషనిస్ట్
Mayuri@trudiet.in
“ఈ సమ్మర్లో షుగర్ పేషెంట్స్ ఇవి ట్రై చేయొచ్చు”
Taati munjalu | డీహైడ్రేషన్తో బాధపడుతున్నారా.. ఇవి తింటే చాలు!”
“షుగర్ పేషెంట్లు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలి..?”
“వేసవిలో నిత్యం ఈ పండ్లను తప్పనిసరిగా తినాల్సిందే ఎందుకంటే..?”