సామాన్యుల ఇండ్లపైకి హైడ్రా బుల్డోజర్లతో విరుచుకుపడి.. వందలాది కుటుంబాలను రోడ్డున పడేసిన రేవంత్ ప్రభుత్వం.. ఇప్పుడు 22ఏ నిషేధిత జాబితా అంటూ.. జనాల రెక్కల కష్టాన్ని దోచుకునేందుకు భారీ స్కెచ్ వేసింది. ఇండ్లు, ఫ్లాట్లు, స్థలాలతో పాటు వారసత్వ ఆస్తులనూ నిషేధిత జాబితాలో చేర్చింది. ప్రజలకు తమకంటూ.. ఒక ఆస్తి ఉందనే భరోసా లేకుండా చేసింది. పేదల ఆస్తులే లక్ష్యంగా కాంగ్రెస్ చేస్తున్న వికృత చేష్టలపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిండా ముంచే విధానాలను అమలు చేస్తున్నది. కోలుకోలేని దెబ్బ కొడుతున్నది. ఇప్పుడు రెక్కల కష్టంతోనో, అప్పులు చేసుకొని.. కొనుగోలు చేసి.. ఎప్పటినుంచో నివాసం ఉంటున్న ఇండ్లను ‘నిషేధిత జాబితాలో చేర్చి.. ప్రజల సొంతింటి కలను చెల్లాచెదరు చేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన తుగ్లక్ ఆదేశాలతో తమ కష్టార్జితమే ప్రశ్నార్థకమైందనే భయం జనాల్లో పెరిగిపోతున్నది. పైసా, పైసా కూడబెట్టి సంపాదించిన ఆస్తులు కూడా తమకు కాకుండాపోతున్నాయన్న బాధ వారిని వేధిస్తున్నది. కంటిమీద కునుకులేకుండా పోతున్నది. -సిటీబ్యూరో
సిటీబ్యూరో, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ): పేదల ఆస్తులే లక్ష్యంగా కాంగ్రెస్ చేస్తున్న వికృత చేష్టలపై జనా లు వణికిపోతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జనాలను నిండా ముంచే విధంగా చేపట్టిన విధానాలతో బెంబేలెత్తిపోతున్నారు. సామాన్యుల ఇండ్లపై హైడ్రా బుల్డోజర్లను ఎగదోసిన రేవంత్ సర్కార్ వందలాది కు టుంబాలను రోడ్డున పడేసింది. ఇప్పుడు అదే తరహాలో తమకంటూ ఒక ఆస్తి ఉందనే భరోసా లేకుండా నిషేధిత జాబితాలో వారసత్వ ఆస్తులను సైతం చేర్చి కోలుకోలేని దెబ్బ కొడుతోంది.
భూముల వివరాలు, దశాబ్దాల కిందటి నుంచి సాగుతున్న లావాదేవీలపై ఏమాత్రం పట్టింపు లేకుండా… కేవలం ధనార్జనే లక్ష్యంగా వేలాది ఎకరాల భూములు, ఇండ్లపై 22ఏ జాబితాలో చేర్చి చోద్యం చూస్తోంది. సొం తింటి కలను చెల్లాచెదురు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన తుగ్లక్ ఆదేశాలతో తమ కష్టార్జితమే ప్రశ్నార్థకమైందనే భయం పెరుగుతోంది. పైసా, పైసా కూడబెట్టి సంపాదించిన ఆస్తులు కూడా తమకు కాకుండాపోతున్నాయని గుండెలు బెదిరిపోయేలా చేస్తోంది. సర్కార్ దౌర్జన్యంగా చేస్తున్న విధానాలతో తమ ఆస్తులను ఎలా కాపాడుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని అత్యంత కీలకమైన, కోట్లాది విలువ చేసే ప్రాంతాలను కూడా విడిచిపెట్టకుండా నిషేధిత జాబితాలో చేర్చిన సర్కారు.. వాటికి యూఎల్సీ, అసైన్డ్ ఎన్వోసీ కావాలం టూ చెబుతున్న మాటలు విని గుండెలు బాదుకునే పరిస్థితులు వస్తున్నాయి.
రెక్కల కష్టంతోనో, అప్పులు చేసో కొనుగోలు చేసి, ఎప్పటినుంచో నివాసం ఉంటున్న ఇండ్లపై తమకు హక్కే లేదన్నట్లుగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోంది. ఎప్పటివో దస్ర్తాల ఆధారంగా చేసిన వేలాది ఎకరాల్లో ఉన్న ఖాళీ జాగాలను, దశాబ్దాల కిందటే అనుమతులు తీసుకుని, పన్నులు కడుతున్న ఆస్తులను సామాన్యుడికి కాకుండా చేస్తోంది. నగరవ్యాప్తంగా నిషేధిత జాబితా పేరిట జరుగుతున్న దౌర్జన్యాలపై సామాన్యుడి గుండెలు అదిరిపోతున్నాయి. తమవే అనుకుంటున్న ఆస్తులు ఇప్పుడు నిషేధిత జాబితాలో చేరిపోయాయని వణికిపోతున్నారు.
30 ఏండ్ల కిందటి ఆస్తులకు రిజిస్ట్రేషన్లు బంద్..
నగర వ్యాప్తంగా ఒక్కో కాలనీదీ ఒక్కో కథ అన్నట్లుగా రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహారాన్ని మార్చివేసింది. మేడ్చల్ జిల్లా పరిధిలో 30 ఏండ్ల కాలనీల్లో చట్టబద్ధమైన అనుమతులతో కట్టుకున్న ఇండ్లకు యూఎల్సీ సాకుతో రిజిస్ట్రేషన్లు నిలిపివేసి జనాలను దిక్కుతోచని విధంగా చేసింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీ అనుమతులతో కట్టుకున్న ఇండ్లను కూడ అమ్ముకునే వీల్లేకుండా చేసింది. ఆస్తిపై జనాలకు హక్కే లేదన్నట్లుగా నిషేధిత జాబితాలో చేర్చి… క్రయవిక్రయాలు, బ్యాంక్ రుణాలకు అవకాశం లేకుండా చేసింది. నిబంధనల ప్రకారం పరిష్కారం చూపాల్సిన సర్కారు… కాలయాపన చేస్తూ గడిచిన మూడు నెలలుగా జనాలను మానసికంగా వేధింపులకు గురిచేస్తోంది. ఇలా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ నుంచి సంగారెడ్డి వరకు వేలాది కాలనీలు, బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీలు, హెచ్ఎండీఏ వేలం వేసిన వెంచర్లను కూడా నిషేధిత జాబితాలో చేర్చి జనాలను వేధింపులకు గురిచేస్తోంది.
సెటిల్మెంట్లకోసమే..
కొత్తగా ఏ ఒక్క సెంట్ భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుకాయింపు మాటలను జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏ ఒక్కరి భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదంటే… మరి గతంలో రాష్ర్టాన్ని పాలించిన బీఆర్ఎస్ హయాం లో ఎలాంటి అభ్యంతరం లేకుండ రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలు, బ్యాంక్ లోన్లు వచ్చాయంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. సర్ఫేఖాస్, అసైన్డ్, భూదాన్, యూఎల్సీ భూముల పేరిట రాజకీయ, రెవెన్యూ గద్దలు తమ ఆస్తులపై షికారు చేస్తున్నాయని మండిపడుతున్నారు. ఇలా మొత్తం బ్లాక్ చేస్తే పెద్ద సమస్య అవుతుందనీ తెలిసి కూడా అదంతా మేం చూసుకుంటామంటూ సంబంధిత మంత్రి సమాధానం చెప్పడం వెనుక సెటిల్మెంట్ల కోసమే ఈ వ్యవహారాలన్నీ అని జనాలు ఆందోళన చెందుతున్నారు.
ఉక్కుపాదం

నగరంలో ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా, దశాబ్దాల కిందటి కష్టార్జితంపై ఉక్కుపాదం మోపుతున్నది. గల్లీలు, కాలనీలు అనే తేడా లేకుండా, అనుమతులు, కట్టిన పన్నులు, కోర్టు ఉత్తర్వులపై అవగాహన లేకుండా విలువైన భూములపై నిషేధితాస్ర్తాన్ని ప్రయోగించి సామాన్యుడి ఆస్తులను లాగేసుకుంటున్నది. గుట్టల బేగంపేటలో సీలింగ్ సర్ప్లస్ భూములనీ ఉన్నది. అయినా దశాబ్దాల తరబడి నడిచిన న్యాయ పోరాటాలు, కోర్టు తీర్పుల తర్వాత 80 శాతానికి పైగా ప్లాట్ల యాజమానులకు యూఎల్సీకి ప్రభుత్వం నిర్ణయించిన క్రమబద్ధీకరణ రుసుము చెల్లించి క్లియరెన్స్ పొందారు. వాటిలో చట్టబద్ధంగా, నిబంధనలకు అనుగుణంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వంటి సంస్థల నుంచి అనుమతులు పొందారు. గత 10-15 ఏండ్లుగా నివాసం ఉంటున్న ఇండ్లను ఇప్పుడు నిసేధిత జాబితాలో చేర్చి ఆ రెవెన్యూ గ్రామ పరిధిలోని ఆస్తుల మనుగడే లేకుండా చేసింది.
ప్రభుత్వానికి ఆస్తి పన్నులు, విద్యుత్, నీటి ఛార్జీలను క్రమం తప్పకుండా కడుతున్నా… అక్రమంగా ఇంటి యజమానులను భయభ్రాంతులకు గురి చేసేలా ఆస్తులను సర్క్రా నిషేధిత జాబితాలో చేర్చింది. ఎక్కడా చూసిన సర్కారు చేస్తున్న వికృత చేష్టల తీరు, నిషేధిత జాబితా వెనుకున్న భారీ భూ కుంభకోణాన్ని తలుచుకుంటూ జనాలు ఉద్వేగానికి గురవుతున్నారు. కాకతీయ హిల్స్ పార్కులో వాకింగ్ చేసే కాలనీ వాసులంతా ఈ తుగ్లక్ ఆదేశాలను చూసి తీవ్ర భయాందోళనతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
పేదలపై కన్ను

ఒకవైపు హైడ్రా భయం, మరోవైపు 22ఏ నిషేధిత జాబితా మొత్తానికి హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ రంగాన్ని నిర్వీర్యం చేసి, భయాందోళనలు సృష్టించడం వెనుక నగరంలోని వేల కోట్లు విలువ చేసే భూములేనని స్పష్టం అవుతున్నది. కబ్జా చేసి, తక్కువ ధరకు లాక్కునే క్రమంలోనే నిషేధిత జాబితా పేరిట భారీ కుంభకోణానికి కాంగ్రెస్ తెరలేపిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సగటు సామాన్యుడి కష్టాన్ని, కూడబెట్టి కట్టుకున్న ఇంటిపై తమకు హక్కు లేకుండా పోతుందనీ వణికిపోతున్నారు. 22ఏ పేరిట లక్షలాది మందిని రోడ్డున పడేసే ఈ దారుణమైన పరిస్థితులతో ప్రజల ఆస్తులను బలి తీసుకుంటున్నారనే వాదన బలపడుతున్నది.