Bandla Sirisha | చిన్నప్పటి కలను నిజం చేసుకుంది. దర్జాగా అంతరిక్షంలో అడుగుపెట్టింది. తారలను పలకరించింది. తళుకులీనుతున్న భూగోళాన్ని దర్శించుకుంది. ఆ ప్రయాణంలోనూ అనేక అవరోధాలు. సంకల్పబలంతో వాటన్నిటినీ అధిగమించానని చెబుతున్నది బండ్ల శిరీష..
అంతరిక్షంలోకి వెళ్లి నక్షత్రాలతో ఆడుకోవాలనేది నా చిరకాల స్వప్నం. ఆ కల కలగానే మిగిలిపోతుందేమో అని భయపడ్డాను. అమ్మానాన్నలు ఇండియా నుంచి అమెరికా వెళ్లిన తర్వాత నా చదువు అక్కడే మొదలైంది. అప్పుడే అంతరిక్షం గురించి, అంతరిక్ష యాత్రికుల గురించి తెలుసుకున్నాను. కల్పనా చావ్లా గురించీ చదివాను. అచ్చంగా నాలానే ఆలోచించిన ఓ వ్యక్తి పట్టుదలతో ఆకాశంలోకి వెళ్లొచ్చారని తెలిసి.. నా ఆశలకు బలం వచ్చింది. అంతలోనే ఓ అవరోధం. కంటిచూపు సమస్య. నాకు మూడో తరగతిలోనే దృష్టిలోపం మొదలైంది. తప్పనిసరిగా కండ్లజోడు ధరించాల్సి వచ్చింది. వ్యోమగామికి నేత్ర సమస్యలు ఉండకూడదని ఎవరో చెప్పారు. అంతే, నా కల చెదిరిపోయింది. కనీసం అంతరిక్ష శాస్త్రాన్ని అయినా చదువుదామనే ఉద్దేశంతో ఏరోనాటికల్ అండ్ ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్ చేశాను. ప్రాక్టికల్స్లో భాగంగా.. చిన్న చిన్న విమానాలు నడుపుతూ మురిసిపోయేదాన్ని. చదువు పూర్తయ్యాక కమర్షియల్ స్పేస్ ఫ్లైట్ ఫెడరేషన్లో ఏరోస్పేస్ ఇంజినీర్గా అవకాశం వచ్చింది. విమానాల విడి భాగాలు రూపొందించే విభాగంలో పనిచేశాను.
మరోవైపు జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశాను. కొంతకాలానికి ‘వర్జిన్ గెలాక్టిక్’ పేరుతో మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ కంపెనీ అవతరించింది. ప్రతి ఒక్కరికీ అంతరిక్షాన్ని పరిచయం చేయడమే తన లక్ష్యమని ఆ సంస్థ వ్యవస్థాపకుడు సర్ రిచర్డ్ బ్రాన్సన్ ప్రకటించారు. నా ఆశల గురించి తెలిసిన మా ప్రొఫెసర్ వర్జిన్ గెలాక్టిక్లో పనిచేసే నిపుణులను పరిచయం చేశారు. ఫ్లైట్తో పల్టీలు కొట్టించే నా పనితనం వారికి నచ్చింది. నన్ను స్పేస్ఫ్లైట్ టీమ్కి ఎంపిక చేశారు. అంతరిక్షంలోకి వెళ్లేముందు ఎన్నో పరీక్షలు నిర్వహించారు. వాటన్నిటిలోనూ విజయం సాధించాను. ‘యూనిటీ 22’ మిషన్లో భాగంగా మా అంతరిక్షయానం ప్రారంభమైంది. అనుకున్నట్లుగానే మా స్పేస్ క్రాఫ్ట్ ధ్వని కంటే మూడురెట్లు వేగంతో దూసుకెళ్లింది. అంతరిక్షం నుంచి భూమిని చూడటం చాలా ఉత్కంఠభరితంగా అనిపించింది. భూగోళం ఊహించిన దానికంటే ప్రకాశవంతంగా కనిపించింది. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి తెలుగమ్మాయిగా నేను చరిత్ర సృష్టించాను. స్పేస్ నుంచి వచ్చిన తర్వాత వర్జిన్ గెలాక్టిక్లోని పరిశోధన విభాగం వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించాను. యువతకు నా సలహా ఒక్కటే.. మీ అభిరుచికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోండి. మీ మార్గాన్ని మీరే ఎంచుకోండి. గమ్యానికి చేరుకోండి.
తమిళనాడులోని గిరిజనులకు అండగా నిలిచిన మహబూబాబాద్ కుర్రాడు.. ఇంతకీ ఏం చేస్తున్నాడంటే..”