లక్నో: కుమార్తె హత్య కేసులో దంపతులను దోషులుగా కోర్టు నిర్ధారించింది. వారిద్దరికి జీవిత ఖైదు విధించింది. ఒక్కొక్కరికి రూ. 25,000 జరిమానా కూడా విధించింది. (Man, Wife Get Life Term) ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2024 జూన్ 10 అర్ధరాత్రి సమయంలో ధనేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తులసీపూర్ మాధవ్గంజ్లో నివసించే రాజేష్ శుక్లా పోలీసులకు ఫోన్ చేశాడు. ఆస్తి వివాదం నేపథ్యంలో సోదరులు తనపై, తన కుమార్తెపై కత్తితో దాడి చేసినట్లు ఆరోపించాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన రాజేష్ కుమార్తె శ్వేతను ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా, శ్వేత మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. ఆమె మరణంపై పోలీసులు దర్యాప్తు చేశారు. క్లూస్ టీమ్తో పాటు డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరించారు. శ్వేత తాత ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. 2024 జూన్ 12న శ్వేత తండ్రి రాజేష్, సవతి తల్లి కిరణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2024 జూలై 11న వారిపై కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
మరోవైపు ప్రోసిక్యూషన్ ప్రకారం, రాజేష్ తన కుమార్తె శ్వేతకు ఒక వ్యక్తితో వివాహం చేయాలనుకున్నాడు. వరకట్నం హత్య కేసులో నిందితుడిగా ఉండటంతో ఆ ప్రతిపాదనను ఆమె వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో శ్వేత తండ్రి రాజేష్, సవతి తల్లి కిరణ్ కలిసి కత్తితో గొంతుకోసి ఆమెను హత్య చేశారు. పూర్వీకుల ఇల్లు, భూమి పంపకం విషయంలో సోదరులతో వివాదం ఉండటంతో తనపై, తన కుమార్తెపై కత్తితో వారు దాడి చేసినట్లు రాజేష్ పోలీసులకు తప్పడు సమాచారం ఇచ్చినట్లు ప్రోసిక్యూషన్ ఆరోపించింది.
అయితే ఇరుపక్షాల సాక్షుల వాంగ్మూలాలు, సాక్ష్యాధారాలను జిల్లా కోర్టు సెషన్స్ జడ్జి దుర్గా నారాయణ్ సింగ్ పరిశీలించారు. శ్వేత హత్య కేసులో ఆమె తండ్రి రాజేష్, సవతి తల్లి కిరణ్లను దోషులుగా మంగళవారం నిర్ధారించారు. వారిద్దరికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 25,000 జరిమానా విధించినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.