Matla Tirupathi | ఆంధ్రుల పాలనలో వివక్షపాలైన తెలంగాణను జూసి.. ‘రండి రండి అన్నలారా దగాపడ్డ తెలంగాణ తెగువజూపుదాం’ అంటూ దూకుడు ప్రదర్శించాడు. విద్యార్థుల ఆత్మార్పణలకు చలించి.. ‘వద్దురా బలిదానము అది గాదురా ఉద్యమ సిద్ధాంతం’ అంటూ పోరుబాటను పరిచయం చేశాడు. అంతేకాదు.. తన సాహిత్యంతో తెలంగాణ తల్లిని, ఆడబిడ్డల బతుకమ్మను ఈ తరానికి కొంగొత్తగా పరిచయం చేశాడు మాట్ల తిరుపతి. ఆ వాగ్గేయకారుడు ‘జిందగీ’తో పంచుకున్న ప్రస్థానం..
మీ పాట అంటేనే తెలంగాణ మట్టి పరిమళం. సాహిత్యాన్ని ఎక్కడ నేర్చుకున్నారు? మీ గురువులెవరు?
పాటతో నా ప్రయాణం మొదలైంది.. 2001లో. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం, మరిమండ్ల. అమ్మ లక్ష్మి, నాన్న పోచయ్య. చిన్నప్పటి నుంచీ పాటలు పాడటం ఇష్టం. ఊళ్లో జానపదాలు వింటూ పెరిగాను. నాకు గురువు లేరు. నాది సహజ ప్రతిభ. నా నేపథ్యమే నా పాటకు ప్రాణం. నేను దగ్గరగా చూసిన ప్రతి వ్యక్తీ నాకొక పుస్తకమే. నా పాటలకు స్ఫూర్తి మా అమ్మ. ఆమె జోల పాటలు, పొలం పాటలు, పల్లె పాటలు వింటూ పెరిగాను.
ఎంతవరకూ చదివారు?
నేను అమ్మ కడుపులో పడిన నాలుగు నెలలకే, నాన్న బతుకు తెరువుకు దుబాయ్ వెళ్లిండు. నేను పుట్టిన ఎనిమిదేండ్ల తర్వాత మళ్లీ వచ్చిండు. అప్పటి వరకూ నాకు పుట్టెంట్రుకలు తియ్యలేదు. ఆ కారణంగా నా చదువు కూడా వెనుకబడిపోయింది. పాటల చరణాలు తెలియకపోయినా రాయడం మొదలు పెట్టాను. ఏడో తరగతి నాటికే నా దగ్గర ఎనిమిది పాటలున్నాయి. అమ్మే నాకు సర్వస్వం. ఆమె కూలి పనులకు పోయి నన్ను బతికించుకుంది. అమ్మల కోసం ‘సృష్టికి జీవం పోసినది రెండు అక్షరాల ప్రేమ.. నీ గర్భ గుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా’ అనే పాట రాశాను.
సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వరకు మీ ప్రయాణం..
ఏడో తరగతి నాటికే బాల గాయకుడిగా పేరు తెచ్చుకున్నా. శాతవాహన కళా ఉత్సవాల పేరుతో అప్పటి కరీంనగర్ కలెక్టర్ పాటల పోటీలు నిర్వహించారు. అందులో విజేతలకు మెమెంటోలు తయారు చేయించింది నేను పనిచేసే దుకాణంలోనే. ఆ పోటీల్లో నేను విజేతగా నిలిచాను. నేను తయారుచేసిన మెమెంటోను నేనే కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నాను. ఆ తర్వాత, సిరిసిల్లకు వచ్చేశా. అక్కడ రికార్డింగ్ స్టూడియోలు ఎక్కువ. శ్రీనన్న, జడల రమేశ్ అన్న వద్ద అసిస్టెంట్గా చేరాను. అలా నా ఆడియో కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత సిరిసిల్ల నుంచి హైదరాబాద్కు వచ్చేశా.
కొన్ని ఉద్యమ పాటల్ని పంచుకుంటారా?
‘తరగని సంపదున్న నా తెలంగాణ నిరుపేద నువ్వైతివో నా తెలంగాణ’, ‘కోయిలాలో కోయిలమ్మో తెలంగాణ వీరగాథ వినరమ్మ పోరుగాథ కోయిలమ్మో.. కోయిలమ్మా’ పాటలో తెలంగాణ వీరుల గాథను చెప్పాను. ‘రండి రండి మా అన్నలార దండు కట్టుదాం.. దగా పడ్డ తెలంగాణ తెగువ జూపుదాం లెండి లెండి’ అంటూ ఆంధ్రుల పాలనలో దగాపడ్డ తెలంగాణ బిడ్డలను నా పాటలతో మేల్కొలిపాను. ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థుల బలిదానాలు చూసి బాధైంది. ఆత్మహత్యలతో తెలంగాణ రాదు.. పోరాడి సాధించాలని చెబుతూ ‘వద్దురా.. వద్దురా వద్దురా బలిదానము.. అదిగాదుర ఉద్యమ సిద్ధాంతం, అట్ల రాదురా తెలంగాణము’ పాట రాశాను. ఎంతోమంది ఉద్యమకారులను జైళ్లలో చిత్రహింసలు పెడుతుంటే ‘తల్లి తెలంగాణ విముక్తి పోరులో లాఠీల దెబ్బలు దిన్న పుణ్యమే.. గుండ్లు గుండెల్లో దిగినా ఆనందమే’ పాట రాశాను.
తెలంగాణ వచ్చాక ఎలాంటి పాటలపై దృష్టిపెట్టారు?
తెలంగాణ సాధించుకున్న తర్వాత మన సాహిత్యాన్ని ప్రజలకు కొత్తగా పరిచయం చేయాలనుకున్నా. జానపదాలపై ఎక్కువ దృష్టి పెట్టాను. అవి సీడీలు, క్యాసెట్ల రూపంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిలో ‘పొద్దుపొద్దుల్లే రెండు పొద్దులే రెండో యవన్న వోయిలాల గొవ్వియ్యాలాలో..’ అంటూ కలమెత్తాను. తల్లిదండ్రులు, అత్తమామల ప్రేమను వర్ణిస్తూ.. ‘అడ్డెడు అడ్డెడు అల్లీపూలు అత్తామామలు సారెపోయంగా.. తవ్వెడు తవ్వెడు తానిపూలు తల్లీదండ్రులు సారె
పోయంగా’ పాట రాశాను. యువతను ఆకట్టుకునేలా ‘కాలేజీ కన్నెపిల్లరన్నో అబ్బబ్బ కన్నుగొట్టి పిలిచిందిరా’ అంటూ రాసిన పాట ఓ ఊపు ఊపింది.
రాయడం, పాడటం, సంగీతం అన్నీ.. మీరేనా?
నాకు మొదట పాడటం వచ్చు.. జానపదుల పాటలను చిన్నప్పుడే పాడాను. తర్వాత రాయడం నేర్చుకున్నా. ఇప్పుడు వాటికి లయబద్ధంగా సంగీతం ఇస్తున్నా. ఈ మూడు కళల్లోనూ నేను ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోలేదు.
బతుకమ్మ పాటలను కొత్తగా ఎందుకు పరిచయం చేయాలనిపించింది?
చిన్నప్పుడు అమ్మలక్కలతో ఆడిపాడిన బతుకమ్మ పాటలపై నాకు పట్టుంది. అప్పటికే యూట్యూబ్లో పలు వీడియోలు వైరల్ అవుతుండేవి. సోషల్ మీడియా వేదికల కోసం 2014లో మొదటిసారిగా బతుకమ్మ పాట రాశాను. ‘పుడమి ఎదలపై పురుడోసుకున్న కరుణాల తల్లివమ్మా.. ఈ మట్టిబిడ్డల ఇలవేలుపైన మా ఇంటింటి దేవతవమ్మా..’ ఈ పాటను అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లో.. స్మార్ట్ఫోన్లు అంతగా లేని కాలంలోనూ లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. తెలంగాణ ఉద్యమాన్ని, బతుకమ్మను కలిపి రాసిన పాట ఇది. ఏ కళాకారుడికైనా తన పాట ఖండాంతరాల్లో వినిపించాలని ఉంటుంది. ఆ కోరికా తీరింది. అమెరికా, దుబాయ్ వంటి దేశాల్లో పాటలు పాడాను.
సై టీవీతో వందకోట్ల వ్యూవర్ షిప్కు రెండు అడుగుల దూరంలో ఉన్నట్లున్నారు?
అవును(నవ్వుతూ) నాకు ‘సై టీవీ’ అనే యూట్యూబ్ చానెల్ ఉంది. దానికి 16 లక్షల మంది సబ్స్ర్కైబర్లు ఉన్నారు. 92 కోట్లకు పైగా వ్యూవర్షిప్ ఉంది.
వంద మిలియన్ వ్యూస్ దాటిన పాటలెన్ని ?
తెలంగాణ జానపదంలో.. సోషల్ మీడియా వేదికగా పది కోట్ల వీక్షణలు దాటిన పాటల్లో నావే ఎక్కువ. నన్ను అంతలా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు పాదాభివందనం. వాటిల్లో పది కోట్ల వ్యూస్ దాటిన పాటలు ఆరు వరకు ఉన్నాయి. మంగ్లీ పాడిన ‘వెండి కొండాలు ఏలేటోడా.. అడ్డబోట్టూ శంకరుడా’, ‘యేమే పిల్లా అన్నప్పుడల్లా గుచ్చేపూల బాణాలు’.. పాటలకు 15 కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి. ‘ధన్ ధన ధన్’ పాటకు 12 కోట్ల వ్యూస్ ఉన్నాయి. ‘మందుపెట్టినావురో రాములో రాములా’ పాట11 కోట్ల వ్యూస్ సాధించింది.‘తిన్న తిరం పడుతలే.. కూచుకున్న తిరం పడుతలే’ పాట 10 కోట్ల మైలురాయిని దాటింది. నేను ఏ పాటను విడుదల చేసినా, కోట్లాది వ్యూస్తో ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఆ రుణం తీర్చుకోలేనిది.
మీ జీవిత లక్ష్యం?
తెలంగాణ జానపదానికి నావంతుగా సేవ చేయాలనే సంకల్పం ఉంది. అందుకోసం నా పాటలను ఓ పుస్తకంగా తీసుకురావాలని అనుకుంటున్నాను. నా నిర్ణయాన్ని 2014లోనే ప్రకటించా. ఇంకా ఎక్కువ పాటలు వస్తే పుస్తకం మరింత అందంగా ఉంటుందని అనిపించింది. ఇప్పుడు ‘మట్టి పరిమళం’ పుస్తకం పనులు 80 శాతం పూర్తయ్యాయి.
‘మట్టిని తాకిన చేతులకు మరిమరి దండాలో’ పాట గురించి..
ఇది.. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆద్యుడు ఎంపీ సంతోష్ అన్న పుట్టినరోజు పాట. సంతోషన్న బర్త్డే దగ్గర పడుతున్న తరుణంలో అన్న చేస్తున్న మంచి పనిని పాట రూపంలో చెప్పాలని ప్రోగ్రాం డైరెక్టర్ పూర్ణ చెప్పారు. అయితే, సంతోషన్న పేరు కనిపించకుండా, ఆయన చేస్తున్న పని మాత్రమే వినిపించాలన్నాడు. ఈ పాటకు రూపం ఇవ్వడానికి నాకు 15 రోజులు పట్టింది. ఎందుకంటే, నేను అప్పటికే ‘నాకే గనుక రెండు చేతులుంటే’ పాటలో చెట్టు గురించి వివరంగా చెప్పాను. పాటకు రెండు పల్లవి లైన్ల కోసం సంతోషన్న ఫొటోలు చూశాను. అప్పుడే ‘మట్టిని తాకిన చేతులకు మరిమరి దండాలో రామ.. మొక్కలు నాటిన చేతులకు పరిపరి దండాలో..’ అనే లైన్స్ దొరికాయి. ఆ లైన్స్, ట్యూన్ ఒక్కసారి రావడంతో కేవలం 2 గంటల్లోనే పాట రాశాను. ఈ పాట ప్రకృతి ప్రేమికులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
..✍ డప్పు రవి
ఫొటోలు : చిన్న యాదగిరి గౌడ్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Saami Saami | పుష్పలో సామీ సామీ పాట పాడిన మౌనికకు ఇన్స్పిరేషన్ ఈమెనే
భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడిన దుర్గవ్వ ఎవరో తెలుసా
ఎక్కడ మైక్ పెట్టినా హలో హలో మైక్ టెస్టింగ్ అంటుండె.. అది చూసి పాట పాడిస్తుండె
నా పాట కోసం మా నాన్న ఇంట్లో టీవీ కూడా అమ్మేసిండు
Folk Singer Veena | పచ్చని సెట్టూమీద.. పతిరామ సిలకా!
శెనగచేన్ల నిలావడి చేతులియ్యావే.. దాసరి సంధ్య పాట ముచ్చట!