కళా వారసత్వ కుటుంబం కాదు. కావాల్సిందే అని పట్టుబట్టిందీలేదు. వింటూ నేర్చుకుంది. చూస్తూ తెలుసుకుంది. మూడేండ్ల వయసులో మురిపెంగా పాడిన పాట.. సాంస్కృతిక సారథికి వారిధిని చేసింది. తాండూరు బండలకున్నంత పేరు ప్రఖ్యాతులు కట్టబెట్టింది. జానపద జాతరలో జనం పాటల జల్లు కురిపిస్తున్న దాసరి సంధ్య పాట ముచ్చట!
మాది వికారాబాద్ జిల్లా తాండూరు. నేను అప్పుడు మూడో తరగతి చదువుతున్నా. బడిలో ఏవో వేడుకలు జరుగుతున్నాయి. నా వంతుగా ఓ పాటపాడి ఉపన్యాసం ఇచ్చాను. అందరూ చప్పట్లు కొట్టారు. మంజుల టీచర్ కూడా అందరిలాగే ‘శభాష్’ అన్నారు. కానీ, అక్కడితోనే వదిలేయలేదు. ‘బాగా పాడుతున్నావమ్మా’ అని ప్రోత్సహించారు. జానపద గీతాలు నేర్చుకోమని సలహా ఇచ్చారు. ఇంకోసారి బడిలో ఓ పోటీ జరిగింది. జానపదాలు పాడాలి అనేది నా ఆలోచన. కానీ, ‘ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా నేరుగా వేదికపై పాడితే సక్సెస్ అవుతుందో కాదో’ అని సినిమా పాట పాడమని టీచర్లు సూచించారు. నేను సినిమాలోని జానపదగీతాన్ని ఎంచుకున్నా. ‘బతుకమ్మ’ సినిమాలోని ‘సినుకమ్మా వాన సినుకమ్మా ఊరు నేల సిన్నబోయినాది బతుకమ్మా’ పాట పాడి అందరి ప్రశంసలు పొందాను.
మహామహుల మధ్యలో..
అప్పుడప్పుడే పాటల ప్రపంచంలోకి వెళ్తున్న నాకు తెలంగాణ ఉద్యమం గొప్ప వేదికైంది. ఊరూరా తెలంగాణ ఉద్యమ గీతాలు మార్మోగుతున్నాయి. నా గురించి తెలిసినవాళ్లు ఉద్యమ గీతాలు పాడమనేవాళ్లు. ‘పెద్దపెద్ద వాళ్లు పాడుతారు కదా? నా వల్ల అవుతుందో లేదో!’ అని మొదట్లో తటపటాయించినా ఉద్యమ తీవ్రత నన్ను గొంతెత్తేలా చేసింది. ఊరూరూ తిరిగి ఉద్యమ గీతాలు పాడేదాన్ని. నాలుగు రోజులు ఉద్యమంలో ఉంటే.. రెండు రోజులు బడిలో ఉండేదాన్ని. పాట నాకు వారసత్వంగా రాకున్నా.. వింటూ, చూస్తూ నేర్చుకొని మహామహుల మధ్యలో ఉద్యమగీతాలు పాడే స్థాయికి ఎదిగాను. నాన్న వీరన్న ట్రాక్టర్ డ్రైవర్. అమ్మ అలివేలు గృహిణి. ‘ఆ చిన్న పిల్లతో పాటలేంది? సక్కగా చదివించక’ అని ఎంతమంది ఎన్ని మాటలన్నా అమ్మానాన్నలు నన్ను పాటతో విడదీయలేదు.
ట్రాక్టరేసుకొని వచ్చిండు
పాట కోసం నేను ఎంత దూరమైనా వెళ్లేదాన్ని. ఎన్ని ఆటంకాలు వచ్చినా లక్ష్యపెట్టేదాన్ని కాదు. ఆ రోజు మిలియన్ మార్చ్. ఊరువాడ ఒక్కటై ముందస్తుగా ప్లాన్ చేసుకొని ట్యాంక్బండ్ మీదికి వచ్చారు. పోలీసుల నిర్బంధాలు దాటుకొని పక్కా ప్లాన్ ప్రకారం మేమూ చేరుకున్నాం. ఆటా-పాటా అందుకున్నాం. పోలీసులు అడ్డుకున్నారు. మేం లెక్క చేయలేదు. ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ట్రాక్టర్ పనిమీద వెళ్లిన నాన్న ఇంటికి వచ్చి అప్పుడే టీవీ పెట్టిండట. టీవీలో మా గురించి వార్త చూసి బాధపడ్డాడట. నేను చిన్నపిల్లను. తోపులాటలో పడిపోతున్నా. తాండూరు నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి వాహనాలేవీ లేవు. ఎలాగైనా నా దగ్గరికి రావాలనేది ఆయన తపన. ట్రాక్టర్ వేసుకొని మొత్తానికి హైదరాబాద్ వచ్చాడు. మా వేదిక దగ్గరికి చేరుకొని నా వెనకాల నిలబడి భుజం మీద చెయ్యేసి ధైర్యం చెప్తూ మరో రెండు పాటలు నాతో పాడించాడు. కానీ, కొద్దిసేపటికే మమ్మల్నందరినీ పోలీసులు జీపు ఎక్కించారు.
నేనెక్కడున్నానో తెలియదు
ఎప్పట్లాగే ఆ రోజు బడికి వెళ్లాను. కొద్దిసేపటికే తెలంగాణ బంద్ అని ప్రకటించారు. తాండూరు జేఏసీ నాయకులు బడికి వచ్చి నన్ను తీసుకెళ్లారు. కనీసం స్కూల్ డ్రెస్ కూడా మార్చుకోవడానికి సమయం లేదు. నాన్నకైనా ఫోన్ చేద్దామంటే అవకాశం లేదు. వేదిక దగ్గరికి చేరుకునే సరికి కార్యక్రమం మొదలైంది. కేటీఆర్ సార్ మాట్లాడుతున్నారు. మధ్యలో పాట అందుకోవాలని సభకు హాజరైన ప్రజలు కోరడంతో కళాకారుల వేదికపైకి నన్ను ఆహ్వానించారు. నేను వెళ్లి ‘మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరుల్లారా.. జగడమాడుతున్నమో’ అనే పాట పాడాను. వేదికంతా దద్దరిల్లింది. అలా ఆ రోజు జిల్లా మొత్తం తిరిగాను. నేను ఎక్కడున్నానో ఇంట్లోవాళ్లకు తెలియలేదు. ఎవరి ద్వారా తెలుసుకున్నాడో ఏమో నాన్న రాత్రి 12 గంటలకు నా దగ్గరికి వచ్చాడు. ఇంటికి వెళ్లేసరికి ఒంటిగంట అయ్యింది. అన్నం తినబుద్ధి కాలేదు. నిద్రపోదామంటే రోజంతా ఎగిరి దుంకడంతో కాళ్లు పోట్లు మంటలు వస్తున్నాయి. నాకు బాగా గుర్తుంది తెల్లవారుజాము 3 గంటల వరకు నాన్న నా కాళ్లు ఒత్తుతూ, జండూబామ్ రాస్తూ నిద్రబుచ్చాడు. ఇది ఎప్పటికీ మర్చిపోలేను.
పాట చెక్కిన శిల్పం
తెలంగాణ ఏర్పాటైన తర్వాత సాంస్కృతిక సారథిలో ఉద్యోగం వచ్చింది. అప్పుడు అమ్మానాన్న గర్వంగా ఫీలయ్యారు. మా తాతవాళ్లది నాగర్కర్నూల్ జిల్లాలోని రాయవరం. నాన్న ఎప్పుడు ఊరికి వెళ్లినా ‘ఏం వీరన్నా.. పిల్లలను అట్లా ఎక్కడంటే అక్కడ తిప్పొద్దయ్యా. అయినా ఉద్యమంలో పాల్గొంటే ఏమొస్తది చెప్పు అంత చిన్నపిల్లకు’ అనేవారంట కొందరు. నాన్న బాధపడుతూ చెప్పేవాడు. ఉద్యోగం వచ్చినంక అదే ఊర్ల గర్వంగా ‘చూడండయ్యా.. నా బిడ్డ ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది’ అని ఆనందంగా చెప్పుకొన్నాడు. అందుకు నన్ను పాట చెక్కిన శిల్పం అంటుంటారు. ఇప్పుడు నా పాట ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే జానపదంపై దృష్టి పెట్టాను. యూట్యూబ్ వేదికగా మొదటిసారి బంజారా జానపదం పాడాను. ఆ తర్వాత ‘పొలంగట్ల మీద’ తెలుగు జానపదం పాడాను. ‘తెల్లచీర కట్టుకొని నాగమల్లెదారిలో’, ఎర్రెర్ర డబ్బాలోన నా నాగమణీ ఎర్రచీర పంపితి పిల్లో’, ‘శెనగ చేన్ల నిలావడి చేతులియ్యావే’, ‘అమ్మని అంటారా.. ఆడపిల్లని తిడతారా’ వంటి స్వచ్ఛమైన జానపదాలు పాడుతూ పాటతో ప్రయాణిస్తున్నాను.
సీరియల్లో అడిగారు
నా పాటలు, చురుకుదనం చూసి సీరియల్స్లో నటించే అవకాశం ఇచ్చారు. కానీ ఇంట్లోవాళ్లు వద్దన్నారు. ‘ఇప్పటికే పాటలు పాడుతున్నావ్, ఇంకా చదువుకోవాలి. ఇప్పుడే ఎందుకు?’ అనడంతో నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. బీకాం కంప్యూటర్స్ చదివాను. ఇప్పుడు జానపద సాహిత్యానికి ఆదరణ పెరిగింది. కాబట్టి నా పాటలు నచ్చి సినిమాల్లో పాడే అవకాశం కల్పిస్తే కచ్చితంగా నా ప్రతిభను నిరూపించుకుంటాను. యూట్యూబ్ చానెల్ ద్వారా మరిన్ని జానపదాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాను. నాకు రెండు మూడు రకాల డ్యాన్స్లు కూడా వస్తాయి కాబట్టి అవకాశం వస్తే నటనలోనూ రాణించాలి అనుకుంటున్నాను. –దాయి శ్రీశైలం