కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
వలిగొండ, ఏప్రిల్ 8: మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వేములకొండపై స్వామివారిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం
మంత్రి చామకూర మల్లారెడ్డికి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్రెడ్డి ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి స్వాగతం పలికారు. దేవస్థానం అర్చకులు మంత్రికి పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం ధర్మకర్తల మండలి, అర్చకుల ఆధ్వర్యంలో మంత్రిని శాలువాతో సన్మానించి జ్ఞాపికతోపాటు ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాదాద్రి తర్వాత అంతటి ప్రాముఖ్యం ఉన్న దేవాలయం మత్స్యగిరి దేవాలయమన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కరించారని ఆయన గుర్తుచేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధిస్తాడని, రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ నిండునూరేండ్లు జీవించాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మేయర్ సామ బుచ్చిరెడ్డి, ఫీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి, ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి, దేవస్థానం ఈవో కె.రవికుమార్, సర్పంచ్ కొత్త నర్సింహ్మ, మాజీ చైర్మన్ తుమ్మల వెంకట్రెడ్డి, మామిండ్ల రత్నయ్య, అయిటిపాముల రవీంద్ర, దేవస్థానం ధర్మకర్తలు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.