కలెక్టర్ శృతిఓఝా
గద్వాల, ఏప్రిల్ 23 : జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల పూర్తి వివరాలు అందజేయాలని కలెక్టర్ శృతిఓఝా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పూర్తి వివరాలు అందజేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో వసతులు ఏ విధంగా ఉన్నాయో, గదుల పరిస్థితి, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్సౌకర్యం తదితర వసతులపై నివేదిక ఇవ్వాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం తదితర ఏర్పాట్లపై బడ్జెట్ రూపొందిస్తున్నారని ఇం దుకు పక్కాగా ప్రణాళికతో డాటా రూపొందించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలు ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని రూపొందించాలన్నారు. పాఠశాల, కళాశాలల్లో పనిచేసే బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బం ది వివరాలు సేకరించాలన్నారు. ఈనెల 27 నుంచి 30వరకు అన్ని పాఠశాలలు, కళాశాలల వివరాలు సేకరించేందుకు నమూనా అందజేస్తామని మే 15లోగా పూర్తి డాటా ప్రభుత్వానికి అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇన్చార్జి డీఈవో సుశీంధర్రావు మాట్లాడుతూ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి వివరాలు సేకరిస్తామని చెప్పారు. సమావేశంలో అధికారులు ప్రసాద్, శ్వేత, కేశవులు ప్రైవేట్ పాఠశాలల సంఘం నాయకులు బీచుపల్లి పాల్గొన్నారు.
టీకా వేయించుకునేలా చర్యలు తీసుకోవాలి
ప్రాథమిక హెల్త్ సెంటర్ల వారీగా ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేసే బాధ్యత మెడికల్ అధికారులదేనని, 45 ఏండ్లు పైబడిన ప్రతిఒక్కరూ టీకా వేయించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శృతిఓఝా వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కరోనాపై గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు 45ఏండ్లపై బడిన వారందరికీ టీకా వేయించాలన్నారు. ఎంపీడీవోలు, సర్పంచులు ఆయా మండలాలు, గ్రా మాల్లో టీకా పై అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు 45ఏండ్ల్ల పై బడిన వారిని గుర్తించి వారిని పీహెచ్సీకి పంపి టీకా వేయించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్వో చందూనాయక్, దవాఖాన సూపరింటెండెంట్ శోభారాణి,డాక్టర్ శశికళ,సౌజన్య పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఒక్కో నిమిషం కొన్ని ప్రాణాల ఖరీదు