యాదాద్రి భువనగిరి, జనవరి 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి);ఊరూవాడ.. ఎక్కడ విన్నా ఎవుసం మాటే. సకల జనులూ అన్నదాత వెంటే. బండెనక బండి కట్టి రైతన్నల ర్యాలీలు, మహిళల కోలాటాలు.. ఇంటి ముందు రైతు బంధు ముగ్గులు.. డప్పు చప్పుళ్లు.. మంగళ హారతులతో స్వాగతాలు.. మొత్తంగా రైతు బంధు వారోత్సవాలు వేడుకను తలపిస్తున్నాయి. మంగళవారం వలిగొండ మండలంలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి 20కిలోమీటర్లు ట్రాక్టర్ నడిపి ఉత్సాహం నింపారు. భువనగిరి మండలం నమాత్పల్లిలో రైతులు పొలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి, స్వీట్లు పంచుకున్నారు.
జిల్లాలో రైతు బంధు సంబురాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మంగళవారం ఊరూరా టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతులు ట్రాక్టర్ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలు, ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. రైతు వేదికల్లో ఆత్మీయ సమ్మేళనాలు, ఆదర్శ రైతులకు సన్మానాలు వంటి కార్యక్రమాలను నిర్వహించారు. పలుచోట్ల రైతు బంధు ఆకృతిలో రంగవల్లులు వేసి మహిళలు అబ్బురపర్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం పాల్గొని సంబురాలకు మరింత వన్నె తెస్తున్నారు. వినూత్నరీతిలో చేపట్టిన కార్యక్రమాలతో ప్రతి పల్లె, పట్టణం సందడిగా మారాయి. వలిగొండ మండల కేంద్రంతోపాటు టేకులసోమారం, రెడ్లరేపాక, దాసిరెడ్డిగూడెం గ్రామాల్లో నిర్వహించిన సంబురాల్లో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
భువనగిరి అర్బన్, జనవరి 11: ఆరుగాలం కష్టపడి పంట పండిస్తున్న రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్న మహా నేత సీఎం కేసీఆర్ అని మాజీ ఎంపీపీ అతికం లక్ష్మీనారాయణగౌడ్ అన్నారు. మండలంలోని నమాత్పల్లి గ్రామంలో మంగళవారం రైతుబంధు సంబరాలను నిర్వహించారు. టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బబ్బూరి రమేశ్గౌడ్ ఆధ్వర్యంలో వ్యవసాయ పొలంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణగౌడ్ మాట్లాడుతూ గతంలో దుక్కిదున్నినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకూ రైతులు అప్పుకోసం వెళ్లేవారని, రైతుబంధుతో ప్రభుత్వమే పెట్టుబడి సాయం చేయడం గొప్ప విషయమని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కంబాలపల్లి ఆంజనేయులు, ఎల్లంల బాలమల్లేశ్, ఉప సర్పంచ్ పబ్బతి రాములు, వార్డు సభ్యులు, గ్రామస్తులు కొండపురం సుధాకర్, సుర్పంగ వెంకటేశ్, జిట్ట మల్లారెడ్డి, చంద్రారెడ్డి, చంద్రపాల్, బీనబోయిన కుమార్, కె.మల్లేశ్, ఆవుల నరేశ్, నాగు మల్లయ్య, బి.అశోక్, వై.రాములు, వై.చంద్ర, పబ్బతి కనకయ్య, బి.మల్లయ్య పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
సంస్థాన్ నారాయణపురం, జనవరి11 : మండలంలోని పుట్టపాక గ్రామంలో రైతు బంధు సంబురాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. రైతు వేదిక వద్ద గ్రామసభ నిర్వహించి రైతు బంధు, రైతు బీమా పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. రైతులు, ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అన్నదాతల అభివృద్ధి ప్రదాత, రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ గుత్తా ఉమాప్రేమ్చందర్ రెడ్డి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీవెంకటేశ్, సర్పంచ్ సామల భాస్కర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, ఉపాధ్యక్షుడు ఆడెపు పరదేశి, నాయకులు దేప విప్లవరెడ్డి, ఆడెపు సురేశ్, సుక్క గాలయ్య, కొత్త యాదయ్య పాల్గొన్నారు.