Etela Rajender | జవహర్నగర్, ఏప్రిల్ 26 : ఒడ్డు ఎక్కే వరకు ఓడ మల్లన్న.. ఒడ్డు ఎక్కినంకా.. బోడ మల్లన్న అన్న చందంగా సీఎం రేవంత్రెడ్డి తీరు ఉన్నదని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఆడ బిడ్డల పెండ్లికి తులం బంగారం పెండ్లి పందిట్లోనే ఇస్తామని, మహిళలకు మహాలక్ష్మి పథకంతో ఆర్థికంగా సాయం అందజేస్తామని అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అట్టర్ ప్లాప్ అయ్యిందని దుయ్యబట్టారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జవహర్నగర్ కార్పొరేషన్లోని ఫైరింగ్కట్టా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్ములాటలకే సరిపోతుందని, రాష్ట్ర అభివృద్ధిపై సోయి లేదని, ఆసరా, దివ్యాంగులకు పింఛన్లు పెంచుతామని చెప్పిన మాటలు.. నీటి మూటలుగానే మిగిలిపోయాయని అన్నారు.
ఉత్త చిప్ప, లంకెబిందెలు అంటూ.. పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ప్రజల్లో సానుభూతి పొందుదామని చూస్తున్న సీఎం రేవంత్రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. రైతు కంట నీరు పెట్టించిన ఏ ప్రభుత్వాలు మనుగడ సాధించలేదని, సరైన కరెంటు, మద్దతు ధర లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులున్నారని విమర్శించారు. దేశ అభివృద్ధి ప్రధాని మోదీతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏనుగు సుదర్శన్ రెడ్డి, విక్రంరెడ్డి, చంద్రశేఖర్యాదవ్, కమల్, కార్యకర్తలు పాల్గొన్నారు.