న్యూఢిల్లీ: భారతదేశంలో గుడ్ల వినియోగం, ఉత్పత్తిపై వెలువడిన నివేదిక పలు ఆసక్తికర వివరాలను వెల్లడించింది. నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ(ఎన్ఈసీసీ) ప్రజల్లో గుడ్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నది. 25 వేల మందికిపైగా పౌల్ట్రీ రైతులు సభ్యులుగా ఉన్న ఎన్ఈసీసీ రోజువారీ గుడ్డు ధరలను నిర్ణయించడంలో కీలక ప్రాత్ర పోషిస్తున్నది. ప్రస్తుతం భారత పౌల్ట్రీ రంగం సుమారు రూ.1,14,000 కోట్ల విలువతో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ఎదిగింది.
ఏటా 13,800 కోట్ల గుడ్లను ఉత్పత్తి చేస్తూ, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద గుడ్ల ఉత్పత్తిదారుగా నిలిచింది. అయితే ఇందులో 11,000 కోట్ల గుడ్లు మాత్రమే వినియోగదారులకు అందుతున్నాయి. రవాణా లోపాల కారణంగా ఏటా 1,000 కోట్ల గుడ్లు వృథా అవుతున్నాయని ‘ఇంక్-42’ తన అధ్యయనంలో తెలిపింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర తదితర రాష్ర్టాలు గుడ్ల ఉత్పత్తిలో ముందున్నాయి. ఒక భారతీయుడు ఏడాదికి సగటున 101 గుడ్లను మాత్రమే తింటున్నాడు. ఇది ప్రపంచ సగటు కంటే 44 శాతం తక్కువ.