యాదాద్రి భువనగిరి, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో 2,13,805 రేషన్ కార్డులు ఉండగా.. వీటిలో ఆహార భద్రతా కార్డులు 2,00,102, అంత్యోదయ కార్డులు 13,703 ఉన్నాయి. మొత్తం 6,65,357 యూనిట్లకు గాను నెలనెలా రూపాయికి కిలో లెక్కన 4,251.083 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం 481 చౌకధరల దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నది. అంత్యోదయ కార్డుదారులకు అరకిలో చక్కెరను అందజేస్తున్నారు. గత రెండేండ్ల కాలంలో చాలా మంది కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా.. వివిధ కారణాలతో ప్రభుత్వం కార్డులను మంజూరు చేయలేకపోయింది. పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు మోక్షం కల్పించి రేషన్ కార్డులను మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో గత కొద్దిరోజులుగా సంబంధిత శాఖ అధికారులు దరఖాస్తుల పరిశీలన జరిపారు. వివిధ మండలాల నుంచి పెండింగ్ దరఖాస్తుల లెక్కలు తీసి అర్హుల జాబితాలను రూపొందించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఆర్ ఎం.ఫంక్షన్ హాల్లో మంత్రి జగదీశ్రెడ్డి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు పంపిణీ చేయనున్నారు.
కొత్త రేషన్ కార్డులు 5,934..
యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పాటు నుంచి గత నెలాఖరు వరకు కొత్త రేషన్ కార్డుల కోసం 11,062 దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయి వేరుగా ఉంటున్నవారు.. కొత్తగా పెండ్లిళ్లు చేసుకున్నవారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్, ముంబై తదితర ప్రాంతాలకు వలసవెళ్లి సొంతూళ్లకు వచ్చిన వారు సైతం గత రెండేండ్ల కాలంలో పెద్దఎత్తున కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. కొత్త జిల్లా ఏర్పాటు సందర్భంగా జారీ చేసిన 2,408 కార్డులు మినహా.. గడిచిన రెండేండ్లలో వివిధ కారణాలతో కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టలేదు. ఆర్ఐ లాగిన్లో 4,416 దరఖాస్తులు, తహసీల్దార్ లాగిన్లో 763 దరఖాస్తులు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి లాగిన్లో 3,143 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, వీటి పరిశీలన అనంతరం 5,934 కార్డులు అర్హత పొందినట్లు తేల్చారు. డైనమిక్ కీ రిజిస్టర్లో కొత్త కార్డుదారులను నమోదు చేసి వచ్చే నెల నుంచే రేషన్ దుకాణాల ద్వారా బియ్యాన్ని అందజేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
షెడ్యూల్ వారీగా పంపిణీ
జిల్లాలో ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు నిర్ణయించిన తేదీల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు ఈనెల 26న సోమవారం భువనగిరి మండల లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. అదేరోజున చౌటుప్పల్, నారాయణపురం మండలాల లబ్ధిదారులకు కూడా కార్డులను పంపిణీ చేస్తారు. ఆలేరు, ఆత్మకూరు(ఎం), మోటకొండూరు మండలాల వారికి ఈనెల 27న ఉదయం 10 గంటలకు దొంతిరెడ్డి సోమిరెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేయనున్నారు. గుండాల మండలం వారికి మధ్యాహ్నం 2 గంటలకు గుండాలలో అందజేయనున్నారు. వలిగొండ మండలం లబ్ధిదారులకు సైతం 27తేదీననే పంపిణీ చేస్తారు. ఈనెల 28న బీబీనగర్, అడ్డగూడూరు, మోత్కూరు మండలాల వారికి, 29న రామన్నపేట, పోచంపల్లి మండలాల లబ్ధిదారులకు కార్డులను అందజేస్తారు. 30న బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల వారికి ఉదయం 10గంటలకు మాదాపూర్ గ్రామంలో కార్డుల పంపిణీని చేపట్టనుండగా, అదేరోజు ఉదయం 11గంటలకు యాదగిరిగుట్ట, రాజాపేట మండలాల వారికి ఎస్ఎల్ఎన్ఎస్ ఫంక్షన్హాల్లో కార్డులను పంపిణీ చేస్తారు.
పకడ్బందీగా పంపిణీకి చర్యలు
జిల్లాలో కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. నిర్ణయించబడ్డ తేదీల్లో తహసీల్దార్లు ఎంపిక చేసిన ప్రాంతాల్లో కార్డులను పంపిణీ చేయనున్నారు. ప్రజాప్రతినిధుల చేతులమీదుగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. లబ్ధిదారులు మీ-సేవ, ఇంటర్నెట్ కేంద్రాల నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను పొందవచ్చు.