నీలగిరి, ఏప్రిల్ 23 : రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు ఇచ్చినట్లు నిరూపిస్తే తమ అభ్యర్థిని పోటీ నుంచి తప్పిస్తామని, నిరూపించకపోతే జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి మీ అభ్యర్థిని తప్పిస్తారా? అని కాంగ్రెస్ నాయకులకు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం నల్లగొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా లక్ష్మి గార్డెన్స్ నుంచి క్లాక్టవర్, డీఈఓ కార్యాలయం మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ వెనుక ఓపెన్ టాప్ జీపులో అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితోపాటు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, ఇతర ముఖ్య నేతలంతా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ సమీపంలో జరిగిన సభలో జగదీశ్రెడ్డి ప్రసంగిస్తూ.. ఎన్నికలకు ముందు తాము రైతుబంధు వేస్తామని చెప్తే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి దాన్ని నిలిపివేయించారన్నారు. ఎన్నికల తరువాత ఎకరాకు 10 వేలు కాదు 15 వేలు ఇస్తామని చెప్పి నేటికీ ఇవ్వలేదన్నారు.
రైతుబంధు డబ్బులు 10 వేల కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించి కమీషన్ల రూపంలో జేబులు నింపుకొని ఢిల్లీకి కప్పం కట్టారని ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నేటికీ అమలు చేయలేదని, దీనిపై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. అన్నదాతను కాంగ్రెస్ నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో వంద రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టండి అని సీఎం రేవంత్, రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతా అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారని, వారినే చెప్పుతో కొట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. గడిచిన ఐదేండ్లలో ఎన్ని వ్యవసాయ పంపుసెట్లు కాలిపోయాయి, నాలుగు నెలల్లో ఎన్ని కాలిపోయాయో లెక తీద్దామని కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. పూటకో మాట మార్చే పార్టీ కాంగ్రెస్ అని ప్రజలకు అర్థమైందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
60 ఏండ్లు నాశనం చేసిన జిల్లాను పదేండ్లలో కేసీఆర్ సస్యశ్యామలం చేసి 3 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతి ఉన్న ధాన్యాన్ని 40 లక్షలకు పెంచారని తెలిపారు. ఫ్లోరైడ్ పీడిత జిల్లాను ధాన్యాగారంగా మార్చిన చరిత్ర కేసీఆర్దేనని పేర్కొన్నారు. నాగార్జునసాగర్లో 508 ఫీట్ల లెవల్లో నీరు ఉన్నప్పుడు కూడా ఎడమ కాల్వకు నీళ్లిచ్చామని, ఇప్పుడు 516 ఫీట్లు ఉన్నప్పటికీ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉండి కూడా నీరు ఇవ్వలేక పోయారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు కాకముందే ఇద్దరు మంత్రులు జిల్లాలో ఉండి మూడున్నర లక్షల ఎకరాలను ఎండబెట్టినందుకు ఓటు వేయాలా? అన్ని ప్రశ్నించారు. డిసెంబర్ 9న ఆరు గ్యారెంటీలు, 13 పథకాలు, 420 హామీలంటూ కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. కేసీఆర్ తీసుకొచ్చిన అన్ని పథకాలను నిర్వీర్యం చేసిందన్నారు. ప్రజలకు చేసిందేమీ లేక సీఎం రేవంత్ బూతులు తిడుతూ, అబద్ధాలు ఆడుతూ, కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. నేడో, రేపో సీఎం రేవంత్రెడ్డి పదవి పోతే నరేంద్రమోదీ మద్దతుతో అధికారం నిలుపుకొనేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు.
నరేంద్ర మోదీ ప్రథమ శిష్యుడే రేవంత్రెడ్డి అని, ఆయనను అనుసరించే పాలన సాగిస్తానని చెబుతున్నారని అన్నారు. తెలంగాణను నాశనం చేసిన చంద్రబాబు, వైఎస్ఆర్ వారసుడు లిల్లీపుట్ రేవంత్ అని ఎద్దేవా చేశారు. ఏ మొహం పెట్టుకొని కేసీఆర్ నల్లగొండ జిల్లాకు వస్తాడని మంత్రి కోమటిరెడ్డి అనడం సిగ్గు చేటన్నారు. ఫ్లోరిన్ మహమ్మారిని తరిమికొట్టి జిల్లాను సస్యశ్యామం చేసిన కేసీఆర్కే ఓటు అడిగే హక్కు ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ను ప్రజలు తన్ని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వాళ్ల స్పందన చూస్తే అర్థమవుతుందన్నారు. ఈ ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండాయే అని, బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలుపు తథ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ సూర్యాపేట, నల్లగొండ జిల్లాల అధ్యక్షులు బడుగుల లింగయ్యయాదవ్, రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్, తిప్పన విజయసింహారెడ్డి, రాష్ట్ర నాయకులు ఇస్తావత్ రామచంద్రనాయక్, రేగట్టె మల్లికార్జున్రెడ్డి, నల్లమోతు సిద్ధార్థ, మారిపెద్ది శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బోనగిరి దేవేందర్, కటికం సత్తయ్యగౌడ్ పాల్గొన్నారు.